JNU Violence: ఢిల్లీ పోలీసులపై ముప్పేట దాడి: వారి తీరుకు సిగ్గుపడుతున్నా: సీనియర్ అడ్వొకేట్
Recommended Video
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ)లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు పోలీసులను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి జెఎన్యూ క్యాంపస్ లోకి ప్రవేశించి.. విద్యార్థులు, ప్రొఫెసర్లపై రాడ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంతటికీ కారణం ఢిల్లీ పోలీసులు లేదా వారి అండదండలతో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
నాడు జామియా..నేడు జెఎన్యూ..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజుల కిందట జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనల సమయంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఢిల్లీ పోలీసులు జామియా యూనివర్శిటీ క్యాంపస్ లోకి ప్రవేశించినట్టుగానే.. ఈ సారి జెఎన్యూ తమ టార్గెట్ గా చేసుకున్నారనే ఆరోపణలు వారిపై వెల్లువెత్తుతున్నాయి.
రాహుల్ మెహ్రా ఆగ్రహం..
ఈ దిశగా- ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది రాహుల్ మెహ్రా సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ పోలీసుల తరఫున తాను వాదిస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. వారి తరఫున కేసులు వాదించినందుకు తనను ఉరి తీయాలని చెప్పారు. ఢిల్లీ పోలీసులే స్వయంగా జెఎన్యూ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించడం, విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడలు దిగడానికి సంబంధించిన వీడియో క్లిప్ ను తాను చూశానని ఆయన అంటున్నారు.
ఏబీవీపీపై అనుమానాలు..
గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన ఈ దాడిలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెసర్లు గాయపడ్డారు. వారి తలలు పగిలిపోయాయి. వారంతా ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సుమారు వందమంది గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు, కర్చీఫ్ లు, టవళ్లు అడ్డు పెట్టుకుని క్యాంపస్ లో స్వైరవిహారం చేసిన విషయం తెలిసిందే.
నివేదిక కోరిన కేంద్రం..
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని, దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ రిపోర్ట్ ను యుద్ధ ప్రాతిపదికన కేంద్రానికి పంపించాలని సూచించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.