ఇంత ఘోరమా?: చెట్లను నరకవద్దన్నందుకు యువతిని సజీవదహనం చేశారు
రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెట్ల నరికివేతను అడ్డుకున్నందుకు ఓ యువతిని దారుణంగా కొట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్రగాయాలపాలైన యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొ
జోధ్పూర్: రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెట్ల నరికివేతను అడ్డుకున్నందుకు ఓ యువతిని దారుణంగా కొట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్రగాయాలపాలైన యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోధ్పూర్లోని ఓ గ్రామంలో ఆదివారం రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా.. లలిత అనే 20ఏళ్ల యువతికి చెందిన పొలంలో చెట్లు అడ్డుగా వచ్చాయి. వాటిని తొలగిస్తామని చెప్పగా.. లలిత అందుకు నిరాకరించింది.
చెట్ల నరికివేతకు లలిత ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లలిత.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్లో గ్రామ సర్పంచ్ రణ్వీర్ సింగ్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి సురేష్ చౌదరి చెప్పారు.