జడ్జీలు లేరు..మ్యాన్ పవర్ లేదు: బెంచ్ అందుబాటులో ఉన్నప్పుడు చూద్దాం: సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సంపూర్ణ లాక్డౌన్ విధించినప్పటికీ.. రోజువారీ కేసుల్లో ఆశించిన స్థాయిలో తగ్గుదల కనిపించట్లేదు. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులన్నింటినీ నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్.. విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్.. ఈ పిటీషన్పై విచారణ చేపట్టంది. వాదోపవాదాలను ఆలకించింది.

సెంట్రల్ విస్టా నిర్మాణంలో 150 కార్మికులు
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులన్నింటినీ నిలిపివేయాలంటూ అన్యా మల్హోత్రా, సొహైల్ హష్మీ ఈ పిటీషన్ను దాఖలు చేశారు. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూథ్రా పిటీషన్ల తరఫున తన వాదనలను వినిపించారు. తాముఈ ప్రాజెక్ట్ను ఛాలెంజ్ చేయట్లేదని, నిర్మాణ పనులను కొద్దిరోజుల పాటు మాత్రమే వాయిదా వేయాలని కోరుతున్నామని అన్నారు. 150 మంది కార్మికులు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. రోజూ వారిని ప్రత్యేక బస్సులో సరాయ్ కాలేఖాన్ ప్రాంతం నుంచి నిర్మాణ ప్రదేశానికి తరలిస్తున్నారని గుర్తు చేశారు.

ఢిల్లీ హైకోర్టులో 17వ తేదీకి వాయిదా..
ఈ పరిస్థితుల్లో వారు కరోనా వైరస్కు గురి కావడానికి అవకాశాలు ఉన్నాయని, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ.. తన పరిధిలోని అన్ని నిర్మాణ ఫనులను రద్దు చేసిందని గుర్తు చేశారు. దీనికి బెంచ్ బదులిస్తూ- ఈ అంశం ఇప్పటికే ఢిల్లీ హైకో్ర్టులో వద్ద విచారణలో ఉందని, ఆ స్థితిలో ఉన్న పిటీషన్ను విచారణకు అనుమతి ఇవ్వడం వల్ల అందరూ అదే బాట పడతారని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. దీనికి సిద్ధార్థ లూథ్రా బదులిస్తూ- ఈ పిటీషన్పై విచారణనను ఢిల్లీ హైకోర్టు నెల 17వ తేదీకి వాయిదా వేసిందని, హియరింగ్కు రావానికి చాలా సమయం ఉందని అన్నారు.

నాకూ ఇన్ఫెక్షన్
దీనిపై ఎన్వీ రమణ మాట్లాడుతూ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు అందుబాటులో ఉండట్లేదని అన్నారు. మ్యాన్ పవర్ లేదని ఎన్వీ రమణ పేర్కొన్నారు. తనకూ ఇన్ఫెక్షన్ ఉందని, తాను పేపర్లు సరిగ్గా చదవలేకపోతున్నానని ఆయన అన్నారు. ఇవి అసాధారణ పరిస్థితులని స్పష్టం చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని తాను న్యాయమూర్తులను ఆదేశించలేనని అన్నారు. న్యాయమూర్తులతో బలవంతంగా విచారణ జరిపించలేనని ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను సర్కులేట్ చేయాలని, బెంచ్ అందుబాటులో ఉన్నప్పుడు దాని గురించి చూద్దామని తేల్చి చెప్పారు. దీనికి సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ.. తాను కూడా కరోనా బాధితుడినేనని, గత రాత్రే క్వారంటైన్ నుంచి వచ్చానని అన్నారు.
Recommended Video

20 వేల కోట్ల రూపాయలు..
నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ భవన సముదాయంలోకి తీసుకుని రావాలనేది దీని ఉద్దేశం. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ తరహాలో చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉండేలా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భవన నిర్మాణ పనులను నిషేధించిన నేపథ్యంలో- అవే ఉత్తర్వులను ఈ ప్రాజెక్ట్కు కూడా వర్తింపజేయాలనేది పిటీషనర్ల వాదన.












Click it and Unblock the Notifications