ఆ బాధ్యత మాదే - చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. గడచిన రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతోందని చెప్పుకొచ్చారు. గత పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ఆరోపించారు. వారి నిర్ణయాల కారణంగా ఎంతో మంది నష్టపోయారని విమర్శించారు. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సమస్యనూ పరిష్కరించే బాధ్యత తమదేనని స్పష్టం చేసారు.
బనగానపల్లెలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా గ్రామసభల్లోనే పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరిట ఓ నల్లచట్టాన్ని తెచ్చారని.. ప్రజల ఆస్తుల్ని కాజేసేలా భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తేవటమే సమస్యను మరింత జఠిలం చేసిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నల్లచట్టాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేశామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారానికి ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లను పెట్టి తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నామన్నారు.

ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది
2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70.,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉందని చంద్రబాబు వివరించారు. ఏపీని ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న దే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. విలేజ్ ఇనామ్ భూములను కూడా 22ఏలో పెట్టేశారని. వీటిని 1971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరులోని వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుందిలో చాలా ఏళ్లుగా ఉన్న భూవివాదాలను పరిష్కరించామని వివరించారు. డోన్ నియోజకవర్గంలో ఉన్న 2,074 ఎకరాల వక్ఫ్ భూముల్ని కూడా 22ఏలో గత పాలకులు పెట్టారు. ఆ భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగించి రైతుల సమస్యల్ని పరిష్కరించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూసమస్యల్ని పరిష్కరించటంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications