Supreme Court 48వ ఛీఫ్ జస్టిస్గా తొలి తెలుగు తేజం: జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: భారత దేశ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీవిరమణ చేశారు జస్టిస్ ఎస్ఏ బోబ్డే. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమోట్ కావడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ 16 నెలల పాటు కొనసాగుతారు. 2022 ఆగష్టు 26 వరకు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎన్వీ రమణ పదవిలో ఉంటారు.
1957 ఆగష్టు 27వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పొన్నవరం అనే చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. రైతు సమస్యలపై, కార్మికుల సమస్యలపై పోరాటాలు చేశారు. న్యాయవృత్తి చేపట్టకముందు ఓ ప్రధాన పత్రికలో జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు జస్టిస్ ఎన్వీ రమణ.1983 ఫిబ్రవరి 10వ తేదీన న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయరుగా ప్రాక్టీసు ప్రారంభించారు.
జస్టిస్ ఎన్వీ రమణ పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సెల్గా వ్యవహరించారు. అదే సమయంలో హైదరాబాదులో రైల్వేకు సంబంధించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్లో అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ బాధ్యతలు చేపట్టారు. 2000వ సంవత్సరం జూన్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా 2013 సెప్టెంబర్ 2వ తేదీన ప్రమోట్ అయ్యారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇక సుప్రీంకోర్టు జడ్జిగా 2014 ఫిబ్రవరి 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఏడేళ్ల పాటు సేవలందించిన జస్టిస్ ఎన్వీ రమణ పలు ముఖ్యమైన తీర్పులను ఇచ్చారు. మొత్తం 156 తీర్పులను జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చారు.
Delhi: Justice NV Ramana takes oath as the new Chief Justice of India (CJI). He was administered the oath by President Ram Nath Kovind, at Rashtrapati Bhavan. pic.twitter.com/jDESeLZh2D
— ANI (@ANI) April 24, 2021
దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా ఒక తెలుగు వ్యక్తి ప్రమాణస్వీకారం చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఎంతో నిరాడంబరంగా సాగిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకార కార్యక్రమంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ముఖ్యమైన కేంద్రమంత్రులు హాజరయ్యారు. కరోనా కారణంగా చాలా పరిమితి సంఖ్యలో అతిథులు కార్యక్రమానికి హాజరయ్యారు.