రేప్ చేస్తే మైనర్లను పెద్దలుగానే చూడాలి: మేనకా గాంధీ
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో బాల నేరస్థులను వేరుగా చూడకూడదని, బాలనేరస్థులను కూడా వయోజనులుగానే పరిగణించి శిక్షలు వేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. దీనికి సంబంధించి చట్ట సవరణ ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో మేనకా గాంధీ దేశ వ్యాప్త చర్చకు దారి తీశారు.
16 ఏళ్ల వయస్సు వారిని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. లైంగిక వేధింపుల కేసులన్నీ 16 ఏళ్లలోపు బాలురపైనే నమోదు అవుతున్నాయని ఆమె తెలిపారు. వారికి బాల నేరస్థుల చట్టంపై పూర్తి అవగాహన ఉందని మేనకా గాంధీ చెప్పారు. అందుకే వాళ్లు ధైర్యంగా అత్యాచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు. వారిని ఈ చట్టం పరిధిలోకి తీసుకువస్తే భయపడి నేరాలు చేయరని ఆమె అభిప్రాయపడ్డారు.

2012 డిసెంబర్ 16 ఢిల్లీ బస్సులో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య తర్వాత రేప్ చట్టాలపై దేశ వ్యాప్త చర్చ మొదలైంది. ఆరుగురు నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది.
మరొక నిందితుడు 17 ఏళ్ల మైనర్ కావడంతో అతనికి మూడేళ్ల శిక్ష మాత్రమే పడింది. అంత పాశవికంగా ప్రవర్తించినప్పటికీ చట్టాలను అడ్డుపెట్టుకుని మైనర్లు తప్పించుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్న తరుణంలో ప్రభుత్వం చట్ట సవరణకు పూనుకుంది.












Click it and Unblock the Notifications