ఓ పక్క వర్షం.!మరోపక్క దీక్ష.!విభజన హామీలకోసం ఢిల్లీలో నిరసన తెలుపుతున్న కేఏ పాల్.!
ఢిల్లీ/హైదరాబాద్: ప్రజా శాంతి పార్టీ అద్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ నిరసన దీక్ష చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కేఏ పాల్ తన దీక్షను కొనసాగిస్తున్నారు. తెలుగు గడ్డ పై ప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పది కోట్ల తెలుగు ప్రజల పక్షాన పోరాడుతున్నట్టు విశ్వశాంతి దూత స్పష్టం చేస్తున్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, విభజన చట్టంలోని హామీలను అమలుకై కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించేందుకు కేఏ పాల్ నడుం బిగించి ఢిల్లీ వీధుల్లో పోరటం చేస్తున్నట్టు ప్రజా శాంతి పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. తెలుగు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దీక్షకు మద్దతు తెలిపి విభజన చట్టంలోని హామీలను సాధించుకుందామని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
విభజన చట్టంలోని హామీల అమలుకై ఢిల్లీలోని జంతర్మంతర్ లో డాక్టర్ కేఏ పాల్ నిర్వహిస్తున్న దీక్షకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఈ దీక్షకు వర్షం అడ్డంకిగా మారగా, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కేఏ పాల్ తన సన్నిహితులతో, మద్దతిచ్చిన ప్రజాసంఘాల నేతలతో దీక్షను కొనసాగిస్తున్నారు. విభజన చట్టంలోని హామీల అమలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై కేఏ పాల్ సమర శంఖారావం పూరించి, పది కోట్ల తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఉద్దేశించిన తన దీక్షకు తెలుగు జాతి యావత్తు ఏకమై మద్దతు పలకాలని పాల్ కోరారు. అంతే కాకుండా అన్ని రాజకీయ పక్షాలకు, ప్రజాసంఘాలకు, రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా కలిసి రావాలని డాక్టర్ పాల్ పిలుపునిచ్చారు.