తుస్సుమనిపించిన బిగ్ షాట్స్..టార్చ్బేరర్స్: తొలి అడుగులోనే పల్టీ: లిస్ట్ పెద్దదే
చెన్నై: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రాజెవరో..బంటెవరో తేలిపోయింది. అధికార పగ్గాలను అందుకునేదెవరో.. ప్రతిపక్ష పాత్రను పోషించేదెవరో స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో కొద్దో, గొప్పో ప్రభావం చూపిస్తారని ఆశించిన కొందరు బిగ్ షాట్స్.. తుస్సుమనిపించారు. రాజకీయాల్లో మార్పులను తీసుకుని రావాలనే సంకల్పంతో ఏకంగా కొత్త పార్టీని సైతం నెలకొల్పినప్పటికీ.. వారికి ప్రజల నుంచి ఆదరణ లభించలేదనేది ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఇక రాజకీయంగా వారి భవిష్యత్తేమిటనేది మున్ముందు తెలియాల్సి ఉంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తళుక్కున మెరిసిన టాప్ స్టార్ కమల్ హాసన్. మక్కల్ నీథిమయ్యం పేరుతో నాలుగేళ్ల కిందటే పార్టీ పెట్టారు. 2019 ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేశారు. ఓటమిని చవి చూశారు. ఆ తరువాత కమల్ హాసన్ ఎదుర్కొన్న అతిపెద్ద ఎన్నికలు ఇవే. తొలి అడుగులోనే బోల్తా కొట్టారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమిళనాడు రాజకీయాల్లో ఎదుగుతారని ఆశించినప్పటికీ- అలాంటి అవకాశమే ఇవ్వలేదు ఓటర్లు. కమల్ హాసన్ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. పార్టీ అధినేతగా కమల్ హాసన్ సైతం విజయాన్ని సాధించలేకపోయారు. 180 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ..లోక నాయకుడికి మిగిలింది- సున్నా. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థిని వనతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.
తమిళనాడులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఖుష్బూ సుందర్ పరిస్థితి కూడా ఇంతే. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆమె అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో పార్టీ ఫిరాయించారు. కమలనాథులతో జట్టు కట్టారు. థౌజండ్ లైట్స్ స్థానం నుంచి పోటీ చేశారు. పరాజయాన్ని చవి చూశారు. డీఎంకే అభ్యర్థి డాక్టర ఇజిలాన్ చేతిలో ఓడిపోయారు. చెపాక్ స్థానం డీఎంకే అభ్యర్థిగా బరిలో దిగిన యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ మాత్రం అదరగొట్టాడు. 60 వేల ఓట్లకు పైగా తేడాతో ఘన విజయం అందుకున్నారు.
పొరుగునే ఉన్న కేరళలో కూడా కొంత మిశ్రమ స్పందన లభించింది. మలయాళ నటులు సురేష్ గోపీ, ధర్మరాజన్ బోల్గట్టి ఓటమి చవి చూడగా.. ముఖేష్, కేబీ గణేష్ కుమార్, ప్లేబ్యాక్ సింగర్ దలీమా జాన్ ఆరట్టుకుళమ్ విజయం సాధించారు. త్రిశూర్ నుంచి సురేష్ గోపీ ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున ధర్మరాజన్ బోల్గట్టి.. బలుస్సేరి స్థానం నుంచి పోటీ చేశారు. సీపీఎం అభ్యర్థిగా ముఖేష్ కొల్లం నియోజకవర్గం నుంచి గెలిచారు. పథనపురం నుంచి కేరళ కాంగ్రెస్ (బీ) అభ్యర్థిగా కేబీ గణేష్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్లేబ్యాక్ సింగర్ దలీమా.. అరూర్ నియోజకవర్గం నుంచి ఆమె సీపీఎం అభ్యర్థినిగా పోటీ చేసి, విజయం సాధించారు.