భారత టెక్కీలూ జాగ్రత్త!: అప్రమత్తం చేస్తున్న విప్రో, కాగ్నిజెంట్..
అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష దాడుల నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. టెక్సాస్ పరిధిలోని హూస్టన్లో విప్రో ఉద్యోగి సుదీప్తా ఇంటిపై దాడి జరిగిన తరువాత..
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష దాడుల నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. టెక్సాస్ పరిధిలోని హూస్టన్లో విప్రో ఉద్యోగి సుదీప్తా ఇంటిపై దాడి జరిగిన తరువాత.. విప్రో సంస్థ తమ ఉద్యోగులు తగు జాగ్రత్తల్లో ఉండాలని, ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని సూచించింది.
ఈ మేరకు ఆన్సైట్ ఉద్యోగులంతా, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుతూ ఈ-మెయల్స్ పంపింది. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఇదే విధమైన లేఖలను ఉద్యోగులకు పంపింది. సురక్షిత ప్రాంతాల్లోనే సంచరించాలని సూచించింది. ఈ రెండు ఐటీ సంస్థల బాటలోనే మరికొన్ని ఐటీ సంస్థలు కూడా నడుస్తున్నాయి. వారి ఉద్యోగుల భద్రత కోసం సూచనలు చేస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం అమెరికాలో దాదాపు లక్ష మంది భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇటీవలి కూచిభొట్ల శ్రీనివాస్ హత్య, ఆ తర్వాత కొద్ది రోజులకే హర్నీష్ పటేల్ అనే వ్యాపారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపి హతమార్చడం, ఆ తర్వాత ఓ భారతీయుడి ఇంటిపై కోడి గుడ్లు, కుక్కల అశుద్ధంతో దాడి ఘటనల తరువాత సుదీప్తా ఇంటిపైనా దాడి జరిగింది.
తన ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చేసరికి కొందరు గుర్తు తెలియని దుండగులు బాధితుడి ఇంట్లోకి చొరబడి వస్తువులను నాశనం చేశారని సుదీప్తా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, సలహాలు, సూచనలు ఇస్తున్నాయి.