బెంగళూరులో ట్రాఫిక్ జామ్: 20 నిమిషాలు సీఎం సిద్దూ, మీరు పోలీసులేనా ? రుచి బాగుందా !
బెంగళూరు నగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ తో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జామ్ ఎలాగుంటుందో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా రుచి చూశారు.
బెంగళూరు: బెంగళూరు నగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ తో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జామ్ ఎలాగుంటుందో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా రుచి చూశారు. 20 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకున్న సీఎం సిద్దరామయ్య పోలీసుల మీద అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.
ఇటీవల బెంగళూరు నగరంలో భారీగా వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలు పరిశీలించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో బయలుదేరారు.
సీఎం సిద్దరామయ్య పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతినగర్, విల్సన్ గార్డెన్ మీదుగా సీఎం సిద్దరామయ్య హెచ్ఎస్ఆర్ లేఔట్ కు బయలుదేరారు. మార్గం మధ్యలో విల్సన్ గార్డెన్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
విల్సన్ గార్డెన్, నిమ్హాన్స్, ఎలక్ట్రానిక్ సిటి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియర్ చెయ్యడానికి పోలీసులు నానా ఇబ్బంది పడ్డారు. 20 నిమిషాల తరువాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో సీఎం సిద్దరామయ్య ప్రయాణిస్తున్న బస్సు ముందుకు కదిలింది. 20 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన సీఎం సిద్దరామయ్య పోలీసు అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.