BPL కార్డులు రద్దు.. విద్యుత్ బిల్లుకు లింక్ పెడుతూ సీఎం కీలక ఆదేశాలు..!!
రేషన్ కార్డుల రద్దు వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులైన వారిని గుర్తించే పనిలో పడింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మినహా దారిద్రరేఖకు దిగువన ఉన్న ( BPL ) వారి రేషన్ కార్డులను రద్దు చేయరాదని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య పౌరసరఫరాల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుల రద్దు వ్యవహారంలో ప్రజలతో పాటు, ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టతనిస్తూ కీలక ప్రకటన జారీ చేసింది.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన బీపీఎల్ కార్డులను దారిద్రరేఖకు ఎగువ కార్డులుగా(APL) మార్చాలని నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయరాదని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే అలాంటి చర్యలు ఏవైనా చేసి ఉంటే వెంటనే ఆ కార్డులను ( BPL ) బాధిత కుటుంబాలకు తిరిగి ఇవ్వాలని సూచించారు. అనధికారికంగా బీపీఎల్ కార్డులను రద్దు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రమే బీపీఎల్ హోదాను కోల్పోతారని సిద్ధారామయ్య స్పష్టం చేశారు.

బీపీఎల్ కార్డు రద్దుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ప్రధానంగా 7.5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలు, 100 CC కంటే ఎక్కవ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాలు ఉన్నారు. దీనిలో జీవనోపాధికి ఉపయోగించే వాహనాలను మినహాయించారు. కాంట్రాక్టర్లు, ఎపీఎంసీ వ్యాపారాలు, కమీషన్ ఏజెంట్లు కూడా బీపీఎల్ కార్డుకు అనర్హులు. నెలకు రూ. 450 కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లించే వారు కూడా బీపీఎల్ కార్డును కోల్పోవాల్సి ఉంటుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి రేషన్ కార్డులు రద్దు చేయమని .. పోరపాటున అలా జరిగితే తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
మరో వైపు రేషన్ కార్డుల రద్దు వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. అనర్హత ముసుగులో హిందువులను టార్గెట్ చేసుకుందని బీజేపీ నేతలు ఆరోపించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి (BPL ) ప్రయోజనాలను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చనప్పటి నుంచి హిందువుల ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా పాలిస్తుందని విమర్శించారు. పేదల పట్ల బీజేపీ అండగా ఉందని తెలిపారు. బాధితులందరి వివరాలను సేకరించి అసెంబ్లీలో లేవనెత్తుతామని కమలం నేతలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications