వేడి వేడి ఇడ్లీ- కనకపుర నాటుకోడి పులుసు: విందులో అనూహ్య నేత..!!
కర్ణాటక రాజకీయాల్లో బ్రేక్ ఫాస్ట్ సమావేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న అధికార బదిలీ వివాదం ఇప్పటికే సద్దుమణిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు కీలక నేతలు ఐక్యతను ప్రదర్శిస్తోన్నారు. ఒకరి ఇంటికి ఒకరు అల్పాహార విందుకు హాజరవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త ట్రెండ్ కు తెర తీసినట్టయింది. విభేదాలు తొలగిపోవడానికి దీన్నొక అస్త్రంలా మలచుకుంటోన్నారు.
ఇటీవలే సిద్ధరామయ్య ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లారు డీకే శివకుమార్. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. అధిష్టానం చెప్పినదాన్ని అనుసరించాలని తాము నిర్ణయించుకున్నామని, నాయకత్వ మార్పు విషయంలో ఎటువంటి గందరగోళం ఉండదని అన్నారు. మీడియానే ఈ గందరగోళాన్ని సృష్టించిందనీ వ్యాఖ్యానించారు.

ఇప్పుడిక సిద్ధరామయ్య వంతు వచ్చింది. ఈ ఉదయం ఆయన బెంగళూరు సదాశివనగర్లోని డీకే శివకుమార్ నివాసానికి అల్పాహార విందుకు వెళ్లారు. ఆయనకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ ఘనస్వాగతం పలికారు. సురేశ్ పూలగుచ్ఛం అందించి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించగా, డీకే శివకుమార్ కరచాలనంతో ఆహ్వానించారు. అనంతరం సిద్ధరామయ్య ఆత్మీయంగా వారితో కలిసి ఇంట్లోకి వెళ్లారు.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్, డీకే సురేష్ తో పాటు కుణిగల్ ఎమ్మెల్యే రంగనాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు ఇష్టమైన ఇడ్లీ- నాటుకోడి పులుసు కాంబినేషన్ తో అల్పాహారం పెట్టారు. సిద్ధరామయ్యకు నాటు కోడి మాంసం అంటే ఇష్టం. నాటుకోడి కూరతో ప్రత్యేక మెనూను సిద్ధం చేయించారు. అల్పాహారంలో ఇడ్లీతో పాటు నాటు కోడి పులుసు, నాటు కోడి ఫ్రై వడ్డించారు. తన అధికారిక నివాసంలో పెంచుతున్న కనకపుర నాటు కోడిని ఇందుకోసం ఉపయోగించారు.

ఈ సందర్భంగా వీరి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యేకించి అధికార మార్పిడికి సంబంధించిన అరకొర వివాదాలు కూడా తొలగిపోయినట్టయింది. ఈ విందుకు డీకే సురేష్, రంగనాథ్ హాజరు కావడం అందరినీ ఆకట్టుకుంది. తన అన్న శివకుమార్ ను ముెఖ్యమంత్రిని చేయాలంటూ ముందు నుంచీ పట్టుబట్టుతూ వస్తోన్నారు సురేష్. ఆయనే ఇప్పుడు ఈ మీటింగ్ కు అటెండ్ కావడం, సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకోవడం ప్రాాధాన్యతను సంతరించుకుంది.
అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8న ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించబోతోన్నామని తెలిపారు. రైతులు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చిస్తామని అన్నారు. అధికార మార్పిడి విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. తాను త్వరలో కేసీ వేణుగోపాల్ను కలుస్తున్నానని సిద్ధరామయ్య చెప్పారు. డీకే సురేష్ కూడా విందులో పాల్గొన్నాడని ప్రత్యేకంగా ప్రస్తావించారు. డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. హైకమాండ్ తలచుకున్నప్పుడు.. అని సిద్ధరామయ్య నవ్వుతూ బదులిచ్చారు.












Click it and Unblock the Notifications