లోయలో పడిన కర్ణాటక మంత్రి కారు, సురక్షితం
బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యుటి ఖాదర్ ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదం మంత్రి నియోజకవర్గంలోని తొక్కొట్టు సమీపంలో సోమవారంనాడు జరిగింది. అదృష్టవశాత్తు మంత్రి, ఆయన సహాయకుడు సురక్షితంగా బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి.
కారు అదుపు తప్పడంతో ఆ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన కారు డ్రైవర్ మోహన్ను ఆస్పత్రిలో చేర్చారు. తొక్కొట్టులో వారు ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బ తిన్నది. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.
మంత్రి ప్రయాణిస్తున్న కారు 15 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. ప్రమాదం జరిగిన స్థలం మంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. తాను బాగానే ఉన్నానని, కార్యక్రమంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి మీడియాతో చెప్పారు.
తన శరీరంపై చిన్నపాటి గాట్లు పడ్డాయని, తాను బాగున్నానని, దేవుడి దయ వల్ల ఏమీ కాలేదని ఆయన మీడియాతో అన్నారు. కసరగోడ్లోని కుంబ్లే సమీపంలో నిరుడు తన కారు మూడు పల్టీలు కొట్టినా తనకు ఏమీ కాలేదని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి లేచి చొక్కాను దులుపుకుని కారు నుంచి బయటకు వచ్చారని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన సహాయకుడు లిజ్జత్ చెప్పారు.