నరబలి కేసు: వీడిన మిస్టరీ, జబ్బు నయం కావడానికే బాలిక బలి
కర్ణాటకలోని మాగడి వద్ద చోటు చేసుకున్న నరబలి ఘటన మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆదివారం నలుగురిని అరెస్టు చేశారు.
బెంగళూరు: కర్ణాటకలోని మాగడి వద్ద చోటు చేసుకున్న నరబలి ఘటన మిస్టరీ వీడింది. పక్షవాతం బారిన పడిన వ్యక్తి కోలుకునేందుకు నిందితులు అభం శుభం తెలియని బాలికను నరబలి ఇచ్చారు.
ఈ మేరకు మాగడికి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ వాసిల్, నజీంతాజ్, రషీదున్నీసాను అరెస్టు చేసిన మాగడి పోలీసులు.. ఈ కేసుకు సంబంధంచి మరో మైనర్ బాలుడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
మహమ్మద్ వాసిల్ కుటుంబ సభ్యుల్లో ఒకరు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎన్నిచోట్ల వైద్యులకు చూపించినా జబ్బు నయం కాలేదు. దీంతో మూఢనమ్మకాలను ఆశ్రయించాడు. బాలికను బలి ఇస్తే పక్షవాతం నయమవుతుందని ఎవరో చెప్పగా విని, నమ్మి తన కుటుంబ సభ్యులతో చర్చించాడు.
అనంతరం బలి ఇచ్చేందుకు బాలిక కోసం అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో మాగడిలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహమ్మద్ నూరుల్లా కుమార్తె ఆయేషాపై నిందితుల కన్ను పడింది.
ఈనెల 1న ఆయేషా ఒంటరిగా స్నేహితుల ఇంటికి వెళుతుండగా నిందితులు అపహరించి క్షుద్రపూజలు చేశారు. అనంతరం ఆయేషాను బలి ఇచ్చి, ఆమె మృతదేహాన్ని సమీపంలోని చెరువులోకి విసిరేసి పారిపోయారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.