సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సీఐ ఆత్మహత్య
బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న సర్కిల్ ఇన్స్ పెక్టర్ పోలీస్ స్టేషన్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు పట్టణంలో జరిగింది.
మాలూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రాఘవేంద్ర (42) మంగళవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.2015లో రాఘవేంద్రను మాలూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ గా బదిలీ చేశారు.
మాలూరు చేరుకున్న రాఘవేంద్ర అరళేరి రోడ్డులోని ఎస్ఎల్ వీ లేఔట్ లో భార్య, కుమారుడితో కలిసి కాపురం పెట్టారు. అప్పటి నుంచి మాలూరు సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

సోమవారం రాత్రి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని సమాచారం రావడంతో ఆయన తన బుల్లెట్ తీసుకుని వెళ్లారు. మంగళవారం వేకువ జామున రాఘవేంద్ర ఒక్కరే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
తరువాత ఒంటరిగా పోలీస్ స్టేషన్ లో టీవీ చూస్తూ ఉండిపోయారు. మంగళవారం ఉదయం ఇన్స్ పెక్టర్ రాఘవేంద్ర సర్వీస్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని సిబ్బంది జిల్లా ఎస్పీ దివ్యా ఎస్. గోపీనాథ్ కు సమాచారం ఇచ్చారు.

కోలారు నుంచి మాలూరు చేరుకున్న జిల్లా ఎస్పీ దివ్యా ఎస్. గోపీనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి కారణంగా రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో సొంత అక్క కుమార్తెను సీఐ రాఘవేంద్ర వివాహం చేసుకున్నారని పోలీసు అధికారులు చెప్పారు. రాఘవేంద్ర డెత్ నోట్ వ్రాసి పెట్టారు. అందులో తన ఆత్మహత్యకు తానే కారణం అని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని రాసి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. కేసు విచారణలో ఉంది.
అవినీతి ఆరోపణలు రావడంతో 2012లో లోకాయుక్త దాడులు చేసిన సమయంలో రాఘవేంద్ర రెడ్ హ్యాడెడ్ గా చిక్కిపోయారని తెలిసింది. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications