కర్ణాటకలో కలకలం: 9వేల నకిలీ ఓటర్ కార్డులు స్వాధీనం
Recommended Video

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నకిలీ ఓటరు కార్డులు కలకలం రేపాయి. జాలహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్లో ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి దాడులు చేసి 9,746 నకిలీ ఓటరు కార్డులను స్వాధీనం చేసుకుంది.
నకిలీ ఓటరు కార్డుల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. నకిలీ ఓటరు కార్డుల విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ఎన్నికల సంఘాన్ని కోరారు.

కాగా, ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సంజీవ్కుమార్ అత్యవసర మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 6.03 శాతం కొత్త ఓటర్లు నమోదవగా... రాజరాజేశ్వరినగర్లో అది 10.3 శాతం ఉండడంతో అధికారులు శోధించారు. దాంతో బెంగళూరు నగరం రాజరాజేశ్వరీనగర్ పరిధి జాలహళ్లిలోని ఎస్ఎల్వి అపార్ట్మెంట్లో కొత్త ఓటర్ల నకిలీ దాఖలు కేంద్రం బయటపడింది.
అధికారుల నుంచి రహస్యంగా సేకరించిన కోడ్ సాయంతో కొత్త ఓటర్లను జాబితాలోకి ప్రవేశపెట్టి నకిలీ కార్డులూ సృష్టించారు. ఇలా రెండు ట్రంకుపెట్టెల్లో భద్రపరచిన 9,746 కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో లక్ష ఓటర్ల గుర్తింపు కార్డులు తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను పట్టుకున్నారు. వీటి తయారీకి వినియోగిస్తున్న ఐదు ల్యాప్ట్యాప్లు, ఓ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారి చెప్పారు. ఇక్కడ ఎన్నికపై 24 గంటల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఇదే కేంద్రంలో ఓ ఎమ్మెల్యే ఛాయాచిత్రాలు లభించినట్లు (పేరు వెల్లడించలేదు) చెప్పారు. ఓటరు కార్డులు గుర్తించిన భవంతిని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ మంగళవారం రాత్రి పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. తీవ్రమైన చర్య తీసుకోకపోతే మరికొందరు ఇలానే ఓటును అంగడి సరుకుగా మార్చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సందేశం పంపారు. నగర పోలీస్ కమిషనర్కూ నేరుగా ఫిర్యాదు చేశారు.
రాజరాజేశ్వరినగర్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రతిస్పందించారు. బాదామి, రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర మంత్రి అనంతకుమార్ డిమాండు చేశారు.
కాగా, నకిలీ ఓటర్ ఐడీ కార్డులు ఉన్న అపార్ట్మెంటులోని ఆ గదిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అద్దెకు తీసుకున్నారని బీజేపీ నేత సదానందగౌడ ఆరోపించారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాజేశ్వరినగర్(ఆర్ఆర్ నగర్)లో ఎన్నికలు జరుగుతాయా? వాయిదా వేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, చిత్రదుర్గలో గాలి అనుచరుడు శ్రీరాములు బంధువుల నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications