కీలక సమావేశం!: రాహుల్గాంధీతో కెసిఆర్, డిగ్గీ హాజరు
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తు, విలీనంపై కీలక సమావేశం జరుగుతోంది. రాహుల్తో తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు.
రాజకీయపరమైన అంశాలను తాను దిగ్విజయ్తో మాట్లాడుతానని కెసిఆర్ ఆదివారం సోనియా గాంధీని కలిసిన అనంతరం చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్, డిగ్గీలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ, రేపట్లో విలీనం లేదా పొత్తు విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని అధిష్టానం నిర్ణయిస్తుందని షిండే చెప్పారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు లాబీయింగ్ చేస్తున్నారు.
సోనియాతో రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్, సభాపతి నాదెండ్ల మనోహర్, సీనియర్ నేత గంగా భవానీ, దామోదర రాజనర్సింహలు వేర్వేరుగా భేటీ అయ్యారు. అంతకుముందు డిగ్గీతో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు భేటీ అయ్యారు.