Delhi Assembly Election 2025: డబ్బు తీసుకోండి.. కానీ ఓటెయ్యకండి : కేజ్రీవాల్
మరో మూడు రోజుల్లో దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ క్రమంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని పేద,బలహీన వర్గాల ప్రజలకు ఓటుకు రూ. 3 వేలు ఇచ్చి ఓటెయ్యాలని.. వారికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇంటినుంచే ఓటు వేసే సౌలభ్యం కల్పిస్తామని బీజేపీ ప్రలోభపెడుతోందని మండిపడ్డారు.
"బీజేపీ నాయకులు ఇంటికి వచ్చి ఓటుకు రూ. 3వేలు ఇస్తామంటున్నారు. మీకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారు.. అని నాకు కాల్స్ వచ్చాయి. ఈ మాటలు విని నేను షాక్ అయ్యాను. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి జరుగుతున్న కుట్ర ఇది. ఈ ట్రాప్ లో పడొద్దు. వాళ్లకు ఓటేశారంటే మిమ్మల్ని జైలుపాలు చేస్తారు.డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ పొరపాటున కూడా ఆ పార్టీకి ఓటెయ్యద్దు." అని దిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కేజ్రీవాల్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు. బీజేపీ కార్యకర్తలు.. ఆప్ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని, అవమానిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు. కార్యకర్తలపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే ముప్పుగా భావించవచ్చని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా, ఎన్నికలు సజావుగా సాగాలంటే ఇండిపెండెంట్ అబ్జర్వర్ లను నియమించాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.
ఇక దిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. దిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications