పంజాబ్ను దోచుకునేందుకే: బ్రిటీషర్లతో పోలుస్తూ కేజ్రీవాల్పై సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ విమర్శలు
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పంజాబ్ను దోచుకునేందుకే కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చారని మండిపడ్డారు. సీఎం చన్నీ సొంత నియోజకవర్గం చామ్కౌర్ సాహిబ్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఇటీవల గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు.
అయితే, అక్రమ తవ్వకాలకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని స్థానిక డిప్యూటీ కమిషనర్ తాజాగా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. విచారణ కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో తనపై కేజ్రీవాల్ అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ అబద్ధాల కోరు. పలు తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నించారు. కానీ, ఏదీ నిజం కాదు. ఆప్ నేతలు నాపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారని, ఆయన ఆదేశాలతో విచారణ జరిగినా.. ఎక్కడా తప్పు జరగలేదని తేలిందన్నారు. చివరకు సత్యమే గెలిచిందన్నారు చన్నీ.

అంతేగాక, అరవింద్ కేజ్రీవాల్ను బ్రిటీష్ వారితో పోల్చారు సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ. బ్రిటీష్ వారు భారత్ను కొల్లగొట్టేందుకు వచ్చారు.. అదే విధంగా కేజ్రీవాల్, అతని ఢిల్లీ కుటుంబసభ్యులు, ఇతర బయటి వ్యక్తులు పంజాబ్ను దోచుకోవడానికి వచ్చారని ఆరోపించారు. అయితే, మొఘలులు, బ్రిటీషర్ల విషయంలో స్పందించినట్లుగానే పంజాబ్ వారిని కూడా సరైన చోటుకే చేర్చుతుందని చన్నీ వ్యాఖ్యానించారు.
పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఈడీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. అతడ్ని కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో కేంద్రంపై చన్నీ సహా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కక్షపూరితంగా తన కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు చరణ్ జిత్ సింగ్ చన్నీ. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications