363 రోజులు జనాల కోసం, 2 రోజులు దేవుడి కోసం: ఎయిర్పోర్ట్ వెనుక రహస్యం!
Alpassi Arattu: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఒక విశిష్టమైన సాంప్రదాయ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. శ్రీపద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన శతాబ్దాల నాటి 'అల్పస్సి అరట్టు' ధార్మిక ఊరేగింపు కోసం గురువారం ఏకంగా 5 గంటల పాటు విమాన సేవలను నిలిపివేశారు. రాజకుటుంబం నాయకత్వంలో ఈ ఊరేగింపు విమానాశ్రయం రన్వే మీదుగా సముద్ర తీరం వరకు చేరుకుంది.
విమానాశ్రయ సేవలు నిలిపివేత
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విమాన రాకపోకలు గురువారం సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా నిలిచిపోయాయి. ఊరేగింపు ఆలయానికి చేరుకున్న తర్వాత రన్ వేను పూర్తిగా శుభ్రం చేసి రాత్రి 9 గంటల నుంచి సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించినట్లు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. శ్రీపద్మనాభస్వామి ఆలయంలోని ఈ ఊరేగింపు ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. ఈ ఆచారంలో భాగంగా ఊరేగింపు తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ రన్వే మీదుగా శంకుముగం బీచ్ వరకు చేరుకోవడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం.
1. అల్పస్సి ఉత్సవం (అక్టోబర్-నవంబర్)
2.పైన్కుణి ఉత్సవం (మార్చి-ఏప్రిల్)

రాజకుటుంబం నాయకత్వంలో ఊరేగింపు
పూర్వ ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ప్రస్తుత అధిపతి అయిన శ్రీ మూలం తిరునాల్ రామవర్మ సాంప్రదాయ రాజ దుస్తులు, ఆకుపచ్చ పట్టు టోపీ, పచ్చల హారం ధరించి ఆచార ఖడ్గంతో ఈ ఊరేగింపుకు ముందు నడిచారు. ఈ అద్భుతమైన ఊరేగింపులో పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందం, అలంకరించిన ఏనుగులు. పోలీసు బ్యాండ్-బాజా, భక్తుల సమూహం పాల్గొనడం గమనార్హం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు విమానాశ్రయం రన్వేను దాటుకుని శంకుముగం బీచ్ చేరుకుంది. అక్కడ ఉత్సవ విగ్రహాలకు 'సముద్ర స్నానం' (అరట్టు) రస్ము పూర్తయిన తర్వాత సాంప్రదాయ కాగడాల వెలుగులో విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువెళ్లారు.
1932 నుంచీ కొనసాగుతున్న చారిత్రక షరతు
ఈ ధార్మిక సంప్రదాయం చాలా శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ.. 1932లో విమానాశ్రయం స్థాపించబడిన తర్వాత కూడా ఈ ఆచారం ఆగకుండా కొనసాగడం దీని ప్రత్యేకత. చరిత్రకారుల ప్రకారం.. విమానాశ్రయం నిర్మాణ సమయంలో అప్పటి ట్రావెన్కోర్ మహారాజు శ్రీ చిత్ర తిరునాల్ ఒక షరతు విధించారు. ఆయన స్పష్టంగా విమానాశ్రయం సంవత్సరంలో 363 రోజులు మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుంది.. కానీ మిగిలిన రెండు రోజులు రాజకుటుంబం ఆరాధ్య దైవమైన భగవాన్ పద్మనాభ స్వామి కోసం కేటాయించబడుతుందని పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ విమానాశ్రయం నిర్వహణను చేపట్టిన తర్వాత కూడా ఈ చారిత్రక ఆచారం చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. విమానాశ్రయ నిర్వహణ ప్రతి సంవత్సరం రెండు ఉత్సవాల సందర్భంగా నోటమ్(NOTAM-Notice to Airmen) జారీ చేసి విమాన పైలట్లు, ఎయిర్లైన్స్కు ఈ తాత్కాలిక సస్పెన్షన్ గురించి సమాచారం అందిస్తుంది.
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం (TIAL) తమ సోషల్ మీడియాలో పంచుకున్నట్లుగా.. ఇది "సంప్రదాయం గగనతలం (Flight) అందుకునే క్షణం." ఈ సంఘటన ఆధునిక సాంకేతికత, ప్రాచీన భక్తి, సంస్కృతులు ఒకచోట కలవడానికి కేరళ ఇస్తున్న గౌరవాన్ని, నిబద్ధతను తెలియజేస్తుంది.












Click it and Unblock the Notifications