ఆడ వారి దెబ్బకి అట్ట పెట్టలే శ్రీరామ రక్ష
బస్సులో ఒక క్షణం... అదే ఓ జీవితాన్ని మింగేసింది. కేరళలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. బస్సులో తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో పెట్టిన వీడియో... ఆ వెంటనే మొదలైన 'డిజిటల్ ట్రయల్'... చివరకు ఒక వ్యక్తి ఆత్మహత్య. ఈ విషాదం ఇప్పుడు "బస్సుల్లో పురుషులకు భద్రత ఉందా?" అనే ప్రశ్నను సమాజం ముందుంచింది.
కోజికోడ్కు చెందిన దీపక్ జనవరి 16న పయ్యన్నూర్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో, ఓ మహిళ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. లక్షలాది మంది చూసి, కామెంట్లు పెట్టి, తీర్పులు చెప్పేశారు. అయితే ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, దీపక్ ఎలాంటి తప్పు చేయలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ అప్పటికే సోషల్ మీడియా కోర్టు తీర్పు చెప్పేసింది. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రాన్ని షాక్కు గురిచేసింది.

చిన్న పొరపాటును పెద్ద నేరంగా..
ఈ ఘటన తర్వాత కేరళలో పురుషుల్లో ఓరకమైన భయం మొదలైంది. "ఇక బస్సులో నిలబడినా, ప్రయాణించినా వీడియో తీస్తారేమో?", "ఏ చిన్న పొరపాటును పెద్ద నేరంగా ముద్ర వేస్తారేమో?" అన్న అభద్రతా భావం బలపడింది. ఈ ఆందోళన ఇప్పుడు వినూత్న నిరసనల రూపంలో బయటపడుతోంది.
కొంతమంది పురుషులు తమను తాము రక్షించుకోవడానికి బస్సుల్లో ప్రయాణిస్తూనే సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. "మేము ఎవరినీ తాకడం లేదు, తప్పు చేయడం లేదు" అని ముందే రుజువు చేసుకునే ప్రయత్నం ఇది. మరికొందరు అయితే అట్ట పెట్టెలు శరీరానికి అడ్డుగా పెట్టుకుని బస్సుల్లో నిలబడుతున్నారు. "ఎవరినీ తాకకుండా ఉండేందుకే కాదు... ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకే" అంటూ వ్యంగ్యంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మెన్స్ కమిషన్ ఏర్పాటు..
ఇదే కాదు... బస్సు కండక్టర్లు సైతం భయంతో వినూత్నంగా స్పందిస్తున్నారు. "పురుషులకు కూడా భద్రత కావాలి", "మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి" అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళల భద్రత ఎంత ముఖ్యమో, తప్పుడు ఆరోపణల వల్ల పురుషుల జీవితాలు నాశనం కాకుండా చూడడమూ అంతే అవసరమన్న వాదన బలపడుతోంది.
ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి మరణంతో ముగిసిన కథ కాదు. సోషల్ మీడియా న్యాయస్థానాలుగా మారితే ఏం జరుగుతుంది? ఆరోపణ, విచారణ, తీర్పు... అన్నీ ఒకే పోస్టుతో జరిగితే దాని పరిణామాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చెబుతోంది. మహిళల రక్షణ, పురుషుల గౌరవం రెండింటికీ సమాన న్యాయం అవసరమని కేరళ ఘటన దేశానికి గట్టి హెచ్చరికగా మారింది.
మగ ప్యాసింజర్లకు, మగ కండక్టర్లకు ఇవి తప్పవా?
— greatandhra (@greatandhranews) January 20, 2026
మూడు రోజుల క్రితం చేయని తప్పుకు తన మీద వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంగా, కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. pic.twitter.com/AXUEYp5Dfc












Click it and Unblock the Notifications