కేరళలో ఒకేరోజు 17వేల కరోనా కేసులు... వీకెండ్లో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం...
కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 24,25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం(జులై 21) రాష్ట్రంలో అదనంగా మరో 3లక్షల కోవిడ్ టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏడు రోజుల వ్యవధిలో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా జిల్లాలపై కరోనా టెస్టులు,చర్యల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు వెల్లడించింది.
అన్ని జిల్లాల్లో కోవిడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలుచేయాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో కరోనా టెస్టుల సంఖ్యను కూడా భారీగా పెంచాలని పేర్కొంది.

బక్రీద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను సడలించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం(జులై 18) నుంచి మూడు రోజుల పాటు నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు కోవిడ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు ఇలా ఆంక్షలను సడలించడమేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల జీవించే హక్కుపై ప్రభుత్వం బాధ్యాతయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం సీఎం విజయన్కు లేఖ రాసింది. నిబంధనల సడలింపుపై పునరాలోచన చేయాలని కోరింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న కోవిడ్ ఆంక్షలను మరో వారం రోజుల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కేసుల విషయానికి వస్తే... గత నెల రోజులుగా రాష్ట్రంలో నిత్యం 10వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,481 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,05,197కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 15,617కి పెరిగింది.ప్రస్తుతం 1,29,640 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications