స్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారం
స్వప్న సురేష్.. కొద్ది గంటలుగా దేశ, విదేశాల్లో మారుమోగిపోతోందీ పేరు. రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి అయిన ఈమె.. తన కాంటాక్టులను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్ దేశాల నుంచి బంగారాన్ని కేరళకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తోంది. డిప్లమాటిక్ వీసాలను అడ్డం పెట్టుకుని ఆమె సాగిస్తోన్న వ్యవహారం ఎట్టకేలకు బట్టబయలైంది. అయితే, ఆమె సీఎంవోలో కీలక ఉద్యోగి కూడా కావడంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రికి తెలిసే ఈ తతంగం సాగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్వప్నా సురేశ్ కు సహకరించిఉంటారనే అనుమానాల నేపథ్యంలో సీఎంవోకు చెందిన టాప్ ఐఏఎస్ అధికారిపై వేటు పడటం తాజా మలుపు.

అసలేం జరిగిందంటే..
కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం ఒకేసారి 30 కేజీల బంగారం పట్టుపడింది. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. పట్టుపడిన బంగారం విలువ రూ.15 ఉంటుందని అధికారులు తెలిపారు. తాను యూఏఈ రాయబార కార్యాలయం ఉద్యోగినని దబాయించిన అతను.. చివరికి నిజం కక్కేయడంతో సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. కేరళ ప్రభుత్వం ఎన్నారై శాఖ ద్వారా వివిధ దేశాలతో నేరుగా దౌత్య సంబంధాలు నెరుపుతుండటం తెలిసిందే.

ఐటీ శాఖలో కీలక ఉద్యోగిని..
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడిన సరిత్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కస్టమ్స్, పోలీస్ అధికారులు స్వప్నా సురేశ్ కోసం గాలింపు ప్రారంభించారు. గతంలో యూఏఈ కాన్సులేట్ లో పనిచేసిన సమయంలోనే స్వప్న పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె.. కేరళ సర్కారు తలపెట్టిన ప్రతిష్టాత్మక ఐటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు(KSITIL)కు మార్కెటింగ్ అధికారిణిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన స్వప్నను ఆ ప్రాజెక్టులోకి తీసుకోవడం వెనుక ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ప్రోద్బలం ఉందని తెలుస్తోంది. సీఎం విజయన్ కు తెలిసే ఆమె నియామకం జరిగిందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

రాజకీయ దుమారం..
స్వప్న సురేష్ పని చేస్తోన్న ఐటీ శాఖకు సీఎం పినరయి విజయనే నిర్వహిస్తుండటం, గతంలో పలు ఆమె సీఎంతో దిగిన ఫొటోలు వైరల్ కావడం, తన స్మగ్లింగ్ కలాపాలకు ఆమె సీఎంవో కాంటాక్టులను కూడా వాడుకున్నట్లు బయటపడటంతో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం కార్యాలయానికి నేరుగా సంబంధాలున్నాయని, స్వప్నను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ ఆరోపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం సీఎం తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో విజయన్ మీడియా ముందుకు రాకతప్పలేదు. ‘‘స్వప్న సురేశ్ నియామకం ఎలా జరిగిందో నాకు తెలియదు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు అర్థంలేదు. స్మగ్లింగ్ కేసుకు సంబంధించి నేరస్తులను విడిచిపెట్టబోము. కస్టమ్స్ అధికారులు బాగా పని చేశారు''అని సీఎం వ్యాఖ్యానించారు.

ప్రిన్సిపల్ సెక్రటరీపై వేటు..
గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తోన్న స్వప్నను ఐటీ శాఖలో చేర్చుకోవడంతోపాటు ఆమెకు దాదాపుగా సహకరించిన ఉంటారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ పై సీఎం విజయన్ చర్యలకు ఉపక్రమించారు. ఆ సీనియర్ ఐఏఎస్ ను పక్కకు తప్పిస్తూ, ఆ స్థానంలో మిర్ మొహ్మద్ అనే యువ అధికారిని మంగళవారం నియమించారు. ఐటీ శాఖలో స్వప్న జాబ్ కాంట్రాక్టు గతంలోనే ముగిసిందని, కొవిడ్-19 క్రైసిస్ వల్ల తొలగింపు ప్రక్రియ ఆలస్యమైందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

స్వప్న వెనుక బడాబాబులు?
డిప్లొమాటిక్ పాస్ పోర్టుతో గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడటాన్ని యుఏఈ రాయబార కార్యాలయం ఖండిచింది. ఎయిర్ పోర్టుల్లో పెద్దగా చెకింగ్స్ లేకుండానే వెళ్లగలిగే సౌకర్యాన్ని ఇలా దుర్వినియోగం చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది. కాగా, స్వప్న స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని ఎవరికి అమ్మాలనుకున్నారు? అటు యూఏఈలో ఎవరి ద్వారా బంగారం పొందారు? ఆమె వెనుక ఇంకెవరైనా బడా బాబులు ఉన్నారా? అనే విషయాలపై కస్టమ్స్, పోలీసు అధికారులు దృష్టిపెట్టారు. మొత్తానికి ఈ వ్యవహారం దేశ, విదేశాల్లో సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications