21 ఏళ్లకే వార్డ్ మెంబర్గా: కేరళ స్థానిక ఎన్నికల్లో బీబీఏ స్టూడెంట్ ఘన విజయం
తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వెనుకంజలో ఉన్న వామపక్ష పార్టీ.. గ్రామీణ స్థాయిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటోంది. గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కంటే భారీ మెజారిటీని సాధించింది.
ఈ క్రమంలో- ఎల్డీఎఫ్ తరఫున పోటీ చేసిన కొందరు విద్యార్థులు విజయాలను అందుకుంటున్నారు. గ్రామ పంచాయతీ వార్డుల్లో పోటీ చేసిన వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు గెలిచారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) విద్యార్థిని రేష్మా మరియం రాయ్ పత్తనంథిట్ట జిల్లా నుంచి ఘన విజయాన్ని సాధించారు. జిల్లాలోని ఆరువప్పుళం గ్రామ పంచాయతీ వార్డ్ నంబర్ 11 నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, యూడీఎఫ్ అభ్యర్థిని సుజాతా మోహన్ను ఓడించారు.
పత్తనంథిట్ట కొణ్నిలోని వీఎఎన్ఎస్ కళాశాలలో గత ఏడాది బీబీఏ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం సమాయాత్తమౌతున్నారు. అదే సమయంలో రాజకీయాల వైపు దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. నామినేషన్లను దాఖలు చేయడానికి కిందటి నెల 19వ తేదీన చివరి తేదీ కాగా.. దానికి ఒక్కరోజు ముందే ఆమె 21వ పుట్టినరోజును జరుపుకొన్నారు. దీనితో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను సాధించినట్టయింది. ఈ ఎన్నికల్లో రేష్మా రాయ్కు 450 ఓట్లు పోల్ అయ్యాయి. ఆమె ప్రత్యర్థి సుజాతా మోహన్కుక 380 ఓట్లు పడ్డాయి.
Recommended Video
మధ్యాహ్నం వరకు అందిన ఫలితాల ప్రకారం.. గ్రామాల్లో తన పట్టును ఎల్డీఎఫ్ తన పట్టును నిలుపుకొంది. పట్టణాలు, నగరాల్లో చేదు ఫలితాలను చవి చూస్తోంది. 941 గ్రామ పంచాయతీలకు ఎల్డీఎఫ్-522, యూడీఎఫ్-363, ఎన్డీఏ-23, ఇతరులు-32 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. 152 బ్లాక్ పంచాయతీల్లో ఎల్డీఎఫ్-108, యూడీఎఫ్-44 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 14 జిల్లా పంచాయతీల్లో ఎల్డీఎఫ్-10, యూడీఎఫ్-4 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల్లో ఎల్డీఎఫ్ వెనుకంజలో ఉంది. 86 మున్సిపాలిటీల్లో యూడీఎఫ్-45, ఎల్డీఎఫ్-35 చోట్ల ఆధిక్యతలో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో పోటాపోటీ నెలకొంది. ఆరు కార్పొరేషన్లలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ చెరో మూడు చోట్ల పైచేయి సాధించాయి.