సీఎం ఇంటికి కూతవేటు దూరంలో.. నలుగురి దారుణ హత్య
తొలుత ఇంటి నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించారు. అప్పటికే మూడు మృతదేహాలు పూర్తిగా తగలబడిపోగా, ఒక మృతదేహం మాత్రం బ్యాగులో చుట్టబడి ఉంది.
తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్ ఇంటికి కూతవేటు దూరంలోనే నలుగురు వ్యక్తులు హత్యకు గురవడం కలకలం రేపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. ఒకే ఇంట్లో వీరి మృతదేహాలు లభించాయి. పరారీలో ఉన్న హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సీఎం పినరయి విజయన్, ఎనిమిది మంది కేబినెట్ మంత్రులు నివాసముండే ప్రాంతానికి దగ్గర్లో నలుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో రిటైర్డ్ ప్రొఫెసర్ రాజ్ తనకం, ఆయన భార్య, ప్రభుత్వ ఆసుపత్రిలో రిటైర్డ్ మెడికల్ సూపరింటెండ్ జీవన్ పద్మ, వారి కుమార్తె, మెడికల్ స్టూడెంట్ కరోల్, ఆమె అత్త లలిత.. ఈ నలుగురు హత్యకు గురయ్యారు.
తొలుత ఇంటి నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించారు. అప్పటికే మూడు మృతదేహాలు పూర్తిగా తగలబడిపోగా, ఒక మృతదేహం మాత్రం బ్యాగులో చుట్టబడి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పిన తర్వాత మృతదేహాలను వెలికితీశారు.
ఇదే ఘటనకు సంబంధించి జైసన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అర్థరాత్రి ఆ ఇంటి నుంచి జైసన్(30) పారిపోతుండగా కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతని కోసం గాలించిన పోలీసులు రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు.
తన తల్లిదండ్రులతో పాటు మిగతా కుటుంబ సభ్యులంతా టూర్ కు వెళ్లారని, వారం వరకు తిరిగి రారని జైసన్ తమతో చెప్పినట్లు జైసన్ బంధువులు వెల్లడించడం గమనార్హం.