కేరళ సీఎం పేరు ఖరారు! కొద్దిసేపట్లో ప్రకటన!!
కేరళలో గత పదేళ్లుగా కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మే 4న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ ఏకంగా 102 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. అయితే గత 10 రోజులుగా ముఖ్యమంత్రి ఎవరనై దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ నేటితో ముగియనుంది. కాంగ్రెస్ అధిష్టానం బుధవారం రాత్రి సుదీర్ఘ చర్చల అనంతరం ఓ పేరును ఖరారు చేసింది. మరికాసేపట్లో తిరువనంతపురంలో జరిగే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో పరిశీలకులు ఆ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
సీఎం పదవి కోసం కాంగ్రెస్లో ముగ్గురు కీలక నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడీ సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేసీ వేణుగోపాల్కు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటు రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల్లో విజయం దిశగా నడిపించిన వీడీ సతీశన్కే ముఖ్యమంత్రి అయ్యే నైతిక హక్కు ఉందని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన రమేష్ చెన్నితల కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ ఎంపిక ప్రక్రియలో రాహుల్ గాంధీ నేరుగా జోక్యం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన 40 నిమిషాల సమావేశంలో ముఖ్యమంత్రి పేరుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కోసం ఢిల్లీ నుంచి ఏఐసీసీ ప్రతినిధులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, దీపా దాస్ మున్షీ ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్నారు. పార్టీలో ఎటువంటి అసమ్మతి తలెత్తకుండా అందరినీ సమన్వయం చేస్తూ ఈ ప్రకటన చేయాలని అధిష్టానం భావిస్తోంది.
పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే సీఎం ఎంపికలో జరుగుతున్న జాప్యంపై మిత్రపక్షమైన ఐయూఎంఎల్ (IUML) ఇప్పటికే అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి తిరువనంతపురం వరకు రాజకీయ ఉత్కంఠ పెరిగిపోయింది. కొద్దిసేపట్లో 'సీల్డ్ కవర్' లో ఉన్న ఆ పేరు బయటకు రాగానే కేరళ నూతన ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్కు తెరపడనుంది.












Click it and Unblock the Notifications