కేరళలో కరోనా కలకలం-పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు : ఒక్క రోజులో 131 మరణాలు..!!
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది. కేసులు స్వల్పంగా నమోదవుతున్నాయి. అయితే, కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత రెండుమూడు రోజుల నుంచి తగ్గినట్టే తగ్గిన కొత్త కేసుల సంఖ్య ఇవాళ మళ్లీ పెరిగింది. ఇవాళ కొత్తగా 23,260 మందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 20,388 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. దాంతో కేరళలో మొత్తం రికవరీల సంఖ్య 42,56,697కు పెరిగింది. ఇవాళ కొత్తగా 131 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 23,296కు పెరిగింది.
ఇక, కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల నుంచి మరణాలు, రికవరీలు పోను మరో 1,88,926 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 1,28,817 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా 23,260 మందికి పాజిటివ్ వచ్చిందని కేరళ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొద్ది రోజుల క్రితం కేరళలో నిఫా వైరస్ సైతం వెలుగులోకి వచ్చింది. కేంద్రం వెంటనే స్పందించి నిపుణులను కేరళకు పంపింది. ప్రస్తుతం ఆ వైరస్ నియంత్రణలోకి వచ్చింది.

కానీ, కరోనా కేసులు తగ్గినాయని భావిస్తున్న వేళ మరోసారి పెరగటం పైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం కేరళలోనే రిజిస్టర్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, రానున్న మూడు నెలల కాలం కీలకంగా కేంద్రం హెచ్చరిస్తోంది. వరుసగా పండుగ సీజన్ కావటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పూర్తి స్థాయిలో తగ్గిందని భావించటానికి అవకాశం లేదని.. మూడు నెలల పాటు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో కేరళలో ఇంత పెద్ద మొత్తంలో కేసుల విస్తరణ పైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా.. కేంద్రం సైతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications