కొల్లం ఘటనలో కాలిన దేహాలను పీక్కుతిన్న కుక్కలు!
కొల్లం: కేరళ రాష్ట్రంలోని కొల్లంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 109కి చేరింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాణసంచా కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు కొల్లం సిటీ పోలీస్ కమిషనర్ పీ ప్రకాశ్ తెలిపారు.
కాగా, పుట్టంగల్ దేవి ఆలయ ప్రాంగణంలో బాణసంచా పోటీలకు అనుమతి లేదని కేరళ సీఎం ఉమెన్ చాందీ తెలిపారు. ఆలయానికి సమీపంలో నివసించే ఓ మహిళ ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు ఆ పోటీలపై నిషేధం విధించామని అన్నారు. అయితే నిషేధం ఉన్నప్పటికీ.. ఆదివారం తెల్లవారుజామున బాణసంచా పోటీలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
దీంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈసారి బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందా? ఉంటే ఎవరిచ్చారు? కొందరు చెప్తున్నట్లుగా నిషేధాజ్ఞలు ఉన్నాయనుకుంటే.. ఆలయంలోకి అంతపెద్ద ఎత్తున బాణసంచా ఎలా చేరాయి? దీనికి ఆలయ పాలకమండలి, అధికారులు లోపాయికారిగా మద్దతు పలికారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిజానికి మీనాభరణి వేడుకల చివరిరోజు బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తున్నది. ఈ క్రమంలో పెద్దఎత్తున వివిధ రకాల బాణసంచాను ఆలయానికి తరలిస్తుంటారు. చివరికి ఇది కొన్ని వర్గాల మధ్య ఆధిపత్య పోటీకి దారితీసి ప్రతి ఏడాది పెద్దఎత్తున బాణసంచాను భారీస్థాయిలో కాల్చుతున్నారు.

దీంతో బాణసంచా మోతతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక మహిళ పంకజాక్షి అమ్మ ఫిర్యాదు మేరకు ఈసారి ఈ కార్యక్రమంపై నిషేధం విధించారు. కానీ.. బాణసంచా కాల్చే కార్యక్రమాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చే భక్తజనాన్ని సంతృప్తిపరిచేందుకు బాణసంచాను కాల్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు బాణసంచాకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కొల్లం సిటీ పోలీస్ కమిషనర్ పీ ప్రకాశ్ తెలిపారు. నిషేధం తొలగించిన ఒక్కరోజులోనే ఇంత పెద్దమొత్తంలో బాణసంచా ఆలయ ప్రాంగణానికి ఎలా చేరాయనేది ప్రశ్నార్దకంగా మారింది. దీనిపై వివరణ కోరేందుకు ఆలయ అధికారులు, పాలకవర్గ సభ్యులు కూడా అందుబాటులో లేరు.
ఘటన జరిగిన వెంటనే వారంతా పరారయ్యారు. ఇదిలా ఉంటే పుట్టంగల్ ఆలయంలో జరిగిన ఘటనలో కాలిన దేహాలను కుక్కలు పీక్కుతిన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆలయం వద్ద బాణసంచా కాల్చుతున్నారని తెలిసి నేను మా కార్యాలయం బయట కుర్చీలో కూర్చొని చూస్తున్నాను. ఇంతలో పరిసరాలన్నీ మంటల్లో చిక్కుకున్నాయి.
జనాలు పరుగులుతీయడం కనిపించింది. వారి వెంటే అగ్గిరవ్వలు కూడా వచ్చాయి.. అని స్థానిక ట్రావెల్ ఏజెంట్ జయకుమార్ అన్నారు. పటాకులు కాల్చడం మొదలైన అరగంటలోనే మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. మంటల్లో చిక్కుకొని కొందరు.. తొక్కిసలాటలో మరికొందరు చనిపోయారు.. అని ఓ టీవీ చానల్ ప్రతినిధి లల్లూ ఎస్ పిళ్లై తెలిపారు.
కాలిన దేహాలను కుక్కలు పీక్కుతినే భయానకాన్ని నేను చూశాను. వాటిని తరిమే ప్రయత్నం చేశాను అని అతను పేర్కొన్నారు. ప్రాణభయంతో పరుగులు తీస్తూ వచ్చిన భక్తులు కొద్దిసేపు మా ఇంటి వద్ద ఆగారు. వారి చెవుల నుంచి రక్తాలు కారడం కనిపించిందని అన్నారు.












Click it and Unblock the Notifications