తాళి తెంచువేళ: వారి వ్యక్తిగతమన్న నటి కుష్బూ
చెన్నై: ద్రవిడ కళగం నేతృత్వంలో మంగళవారం 25 మంది మహిళలు తాళి బొట్టు తెంచుకున్న వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నటి కుష్బూ స్పందించారు. మహిళలు మెడలో తాళి బొట్టు ఉంచుకోవాలా, తీసి వేయాలా? అనేది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అని కుష్బూ వ్యాఖ్యానించారు.
ప్రతి రోజూ జరుగుతున్న పెళ్లిళ్లను ఆపలేదని, వారి నిరసనను ఈ రూపంలో తెలియజేయాలనుకున్నారని ఆమె అన్నారు. స్వతంత్ర భారత దేశంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేయడానికి వీలుందని, ఎవరికి వారు తమకు తోచినట్టుగా భావాలను వ్యక్త పరుస్తుంటారని గుర్తుచేశారు. అంతమాత్రాన అడ్డుకోవడం, ఆందోళనల పేరుతో దాడులకు సిద్ధ పడటం మంచి పద్ధతి కాదని అన్నారు.

కుష్బూ వ్యాఖ్యలకు టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం మద్దతు పలికారు. కాగా మహిళలు తాళి బొట్టు తొలగించడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగానే వ్యతిరేకించాయి. సంప్రదాయాలను మంట గలుపుతున్నారంటూ ద్రవిడ కళగం నేతలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
అయితే ద్రవిడ కళగం మాత్రం తాము అనుకున్నట్టుగా తాళి బొట్లు తొలగించే కార్యక్రమం నిర్వహించింది. అయితే, తమ మనో భావాల్ని కించ పరిచే విధంగా వ్యవహరించారంటూ చెన్నై, ఎగ్మూర్లోని పెరియార్ తిడలపై బాబులుతో దాడికి యత్నించడంతో శివ సేన రాష్ట్ర నేతలు రాధాకృష్ణన్, కార్తికేయన్, రమేష్, ఏలుమలై తదితర 20 మందిని బుధవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications