మహిళలకు ముష్టి.. ఖుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు; తమిళనాట రచ్చ!!
తమిళనాడులో మహిళలకు నెలవారి వెయ్యి రూపాయల పథకాన్ని సినీనటి, బిజెపి నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ విమర్శించారు. మహిళలకు డిఎంకె నెలవారి వెయ్యి రూపాయల ముష్టి ఇచ్చే బదులు డ్రగ్స్ వ్యాప్తిని నిర్మూలించాలంటూ ఖుష్బూ సుందర్ వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూ సుందర్ మహిళలకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని ముష్టితో పోల్చడం పై డీఎంకే మహిళా విభాగం నిరసన వ్యక్తం చేస్తోంది.
మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే తమిళనాడు ప్రభుత్వ పథకాన్ని 'పిచ్చై' అంటే ముష్టి, భిక్షగా ఖుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాట దుమారం రేగింది. ఆమె చేసిన వ్యాఖ్యల పైన రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే మహిళా విభాగం నిరసనలు చేపట్టింది. ఖుష్బూ సుందర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఖుష్బూ డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కేవలం స్టాలిన్ సర్కార్ ఓట్ల కోసమే మహిళలకు వెయ్యి రూపాయలు ముష్టి ఇస్తుందని, డ్రగ్స్ నిరోధించడం మాత్రం మరిచిపోయిందని వ్యాఖ్యలు చేశారు. 2 వేల కోట్ల డ్రగ్స్ కు సంబంధించి తమిళ సినీ నిర్మాత జాఫర్ సాధిక్ ను అరెస్టు చేసిన తర్వాత ఈ వ్యవహారంపై స్పందించిన ఖుష్బూ డీఎంకే డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే ప్రజలు వెయ్యి రూపాయల భిక్షను తీసుకునే అవసరం ఉండదన్నారు.
తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం తెచ్చిన పథకాన్ని ఖుష్బూ విమర్శించడం తప్పని రాష్ట్రవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న క్రమంలో మరోమారు ఖుష్బూ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఖుష్బూ తాను చేసిన వ్యాఖ్యలు కేవలం డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించడం కోసమే చేశానన్నారు.
ఇదే సమయంలో 1982లో అప్పటి ముఖ్యమంత్రి MG రామచంద్రన్ పేదలకు అందించిన ఉచిత భోజనం వారిపై విసిరిన 'పిచ్చై' ( భిక్ష) అని మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ చేసిన ప్రకటనను ఎవరూ ఖండించలేదని గుర్తు చేశారు. డిఎంకె నాయకులు కె పొన్ముడి, ఇవి వేలు వంటి వారు మహిళలు మరియు రాష్ట్ర ప్రజలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉదాహరణలను కూడా ఆమె గుర్తు చేశారు.
అంతేకాదు "అప్పట్లో మీరంతా గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళేనా? నేను డ్రగ్స్ బెడదను ఆపితే మహిళలకు మీ రూ. 1,000 అవసరం లేదు," అని ఆమె X లో తన పోస్ట్లో మరోమారు తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఖుష్బూ.












Click it and Unblock the Notifications