కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్: కాంగ్రెస్ కు చెక్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో అధికార పగ్గాలు చేపట్టామని ఆనందంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పిడుగు పడింది. నీతి, నిజాయితీకి మారు పేరుగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. రాష్ట్రపతి అందుకు ఆమోదం తెలిపారు.
ఈ దెబ్బతో పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు కసరత్తులు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ? అని ఇంకా తేలాల్సి ఉంది.
ఈ పరిస్థితిలో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి అధికారాలు కరువైనట్లే అన్న ప్రశ్న షికార్లు కొడుతుంది. అందుకు కారణం మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ పుదుచ్చేరికి పూర్తి స్థాయి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులు కావడమే. ఆమె విధి నిర్వహణలో కచ్చితంగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే.
పుదుచ్చేరిలో ప్రభుత్వం ఉన్నా అక్కడ అనుమతులు తీసుకోవాలన్నా, సంతకాల అనుమతుల కోసం గవర్నర్ ఎదుట నిలబడాల్సిందే. ఈ కారణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ను ఇరాకటంలో పెట్టడానికి వ్యూహాత్మకంగా కిరణ్ బేడిని రంగంలో దింపారని పలువురు అంటున్నారు.
నిజాయితీగా ఉన్న కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉంటే కాంగ్రెస్ పప్పులు ఉడకవని బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకే ఆమెను అక్కడకు పంపిస్తున్నారని సమాచారం. ఈ విషయంపై కిరణ్ బేడీ స్పందిస్తూ తాను విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటానని ప్రజా సేవకు తాను అంకితం అని సున్నితంగా సమాధానం ఇచ్చారు.