దారుణం: పాడైన బిర్యానీ పెట్టిందని వదినను కొట్టి చంపిన ఆడపడచు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడికి పాడైపోయిన బిర్యానీ పెట్టిందని ఆరోపిస్తూ తన వదినను తీవ్రంగా కొట్టింది ఓ కిరాతక ఆడపడచు. దీంతో బాధితురాలు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతా నగరానికి చెందిన శర్మిష్ట బసు(40) డల్హౌసీ ప్రాంతంలో ఆర్కిటెక్ట్ సంస్థ నడుపుతున్నారు. తన కొడుకు ఆకస్మాత్తుగా వాంతులు చేసుకోవడం చూసిన శర్మిష్ట ఆందోళనకు గురైంది. అందుకు తన వదిన పెట్టిన చద్ది బిర్యానీయే కారణమని భావించింది.
వెంటనే పటౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగూలీ భాగన్ ప్రాంతంలోని వదిన ఇంటికి వెళ్లింది. డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న ఆమె అన్న భార్య ఫల్గుణి బసు(48)ని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టింది. తన కుమారుడికి పాడైపోయిన బిర్యానీ పెట్టి ఆరోగ్యం పాడుచేసిందంటూ చితకబాదింది. దీంతో ఫల్గుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది.
భార్య కేకలు విని భర్త అరిందమ్ బసు, కొడుకు పరుగెత్తుకువచ్చి కిందపడిపోయిన ఫల్గుణి బసును ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఫల్గుణి బసు చనిపోయిందని వైద్యులు తేల్చారు. ఆడపడచు దాడి చేసిన సమయంలోనే ఫల్గుణికి గుండెపోటు రావడంతో మృతి చెందిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా బాధితురాలు, నిందితురాలి మధ్య చిన్న చిన్న గొడవలుండేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఫల్గుణిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.