106 మంది మృతి: కేరళ ప్రమాదంలో షాకింగ్, పోటీయే కారణమా?
తిరువనంతపురం: కేరళలో కొల్లం జిల్లాలోని పుట్టింగల్ ఆలయ సిబ్బందిని బాణసంచాను పేల్చవద్దని చెప్పినప్పటికీ ఆలయ వర్గాలు వినలేదని కొల్లం పోలీసు కమిషనర్ ప్రకాశ్ ఆదివారం నాడు ఆరోపించారు. రాత్రి బాణసంచా వెలిగించే సమయంలో పోలీసు శాఖ అనుమతిచ్చినట్టు పోలీస్ వారికి తెలిపినట్లుగా చెప్పారన్నారు.
కానీ తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఆలయ ప్రాంగణ సమీపంలోని గోడౌన్లో పెద్ద ఎత్తున గన్ పౌడర్ను నిల్వ ఉంచారని దీంతో పేలుడు తీవ్రత బాగా పెరిగిందన్నారు. బాణసంచా కాల్చేందుకు అనుమతులు ఇవ్వనప్పటికీ అన్నింటిని ఉల్లంఘించి ఆలయవర్గాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు.
కొల్లంలోని పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలి 106 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మరో షాకింగ్ నిజం కూడా అని తెలుస్తోంది.
ఆలయ సమీపంలో బాణసంచా పేలుడు ప్రమాదంపై ప్రధాన కారణం వివిధ బాణసంచా కంపెనీల మధ్య నెలకొన్న పోటీనే కారణమని కూడా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. కేరళలోని పలు ఆలయాల్లో వివిధ సందర్భాల్లో బాణసంచా సంబరాలు జరుగుతాయి.
ఈ సందర్భంగా పలు బాణసంచా కంపెనీల నిర్వాహకులు వివిధ రకాలైన బాణసంచాను వెలిగిస్తారు. ఎక్కువ వెలుగులు, రంగు రంగుల బాణసంచా తయారు చేసిన వారిని పోటీల్లో విజేతలుగా ప్రకటిస్తారు. దీంతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది బాణసంచా తయారీదారులు ఆసక్తి చూపిస్తారు.
పోటీ కారణంగా అనేకమంది తయారీదారులు భారీ స్థాయిలో బాణసంచాను నిల్వచేసినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా దీని పైనే బాణసంచా పేలడంతో మొత్తం గోడౌన్కు మంటలు వ్యాపించాయి. దీంతో మొత్తం బాణసంచా పేలిపోవడంతో గోడౌన్ కూలిపోయింది. ఇక్కడే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ కేరళలోని కొల్లం చేరుకున్నారు. విమానంలో తిరువనంతపురం చేరుకున్న ప్రధాని, అక్కడి నుంచి ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లో కొల్లం వెళ్లారు.
అనంతరం అగ్నిప్రమాద బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద వివరాలను ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చాందీ వివరించారు. ఢిల్లీ నుంచి ప్రధాని వెంట తీసుకెళ్లిన 15 మంది వైద్యుల బృందం సేవలు అందిస్తోంది.