కేంద్రం ఇప్పుడు వీరి జీవితాలతో ఆడుకుంటోంది: అగ్నిపథ్ నిరసనలపై కేటీఆర్
హైదరాబాద్: అగ్నిపథ్ పథకంపై యువత చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ నిరసనలు దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని అన్నారు.
అగ్నివీర్ పథకంపై జరుగుతోన్న ఈ హింసాత్మక ఆందోళనలు.. దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలిపే ఖచ్చితమైన సూచికలు. అప్పుడు దేశ అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడేమో దేశ జవాన్లతో ఆడుకుంటున్నారు. మొన్న ఒకే ర్యాంక్-ఒకే పింఛను విధానం. నేడు ర్యాంకు లేదు.. పింఛను లేదు అనే ప్రతిపాదన అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా యువత ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ రైలుకు నిప్పుపెట్టారు. బీహార్, హర్యానాలోనూ ఇదే తరహా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు ఆందోళనకారులు.
సికింద్రాబాద్ అల్లర్లతో మాకు సంబంధం లేదు: బల్మూరి వెంకట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ రైలుకు నిప్పు పెట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడిన ఆందోళనకారులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు. ఆర్మీ నియామక పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దీంతో ఆవేశానికి లోనైన అభ్యర్థులు ఆందోళనకు దిగారని బల్మూరి వెంకట్ తెలిపారు. ఈ సంఘటనతో ఎన్ఎస్యూఐకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల నిరసనకు తమకు ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూకి వెళుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని చెప్పారు. తాను పోలీస్ స్టేషన్ నుంచే ఈ వీడియో ద్వారా స్పష్టతనిస్తున్నట్లు తెలిపారు