Viral Video:చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డు-ఏమైందంటే..?
కోయంబత్తూరు జిల్లాలో జనసమ్మర్దం ఉండే ప్రాంతంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మధుకరై అటవీ ప్రాంతం కేరళ సరిహద్దుకు ఆనుకుని ఉండటంతో, ఇక్కడ తరచుగా వన్యప్రాణులైన ఏనుగులు, చిరుతలు కనిపిస్తుంటాయి. అవి ఆహారం, నీటి కోసం రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడం సర్వసాధారణం.
ఈ నేపథ్యంలో, నవంబర్ 12న అడవి నుంచి బయటకు వచ్చిన ఒక చిరుత ఏకంగా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇరుగూర్ రావుత్తర్ విభాగంలోని NEPC మిల్లు ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ మోటార్ కంపెనీ (గోదాము)లోకి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు, చిరుతను చూసి ఒక్కసారిగా షాక్కు గురై వణికిపోయాడు. అయితే, ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, అంటే నిన్న, కంపెనీ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ దృశ్యాలు బయటపడ్డాయి. ఫుటేజీలో చిరుత నక్కి ఉండటం తెలియని సెక్యూరిటీ గార్డు ప్యాట్రోలింగ్ చేస్తుండగా, చిరుత పారిపోవడాన్ని చూసి అతను భయాందోళనకు గురయ్యే దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరుత సంచారం గురించి సమాచారం అందుకున్న కోయంబత్తూరు అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ చిరుత ఉన్నట్లు ఎటువంటి ఆనవాళ్లు లేవని అధికారులు ధృవీకరించారు. రాత్రి వేళల్లో ఆ ప్రాంత ప్రజలు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇలా పట్టణ ప్రాంతాలకు చిరుతలు రావడం జీవవైవిధ్యానికి ముప్పుగా, మనుషులకు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో, వన్యప్రాణులు అడవి దాటి రాకుండా నివారించడానికి అటవీ శాఖ నిఘాను పెంచింది.












Click it and Unblock the Notifications