కూచ్ బెహార్లో హింసకు కారణమదే... అసలేం జరిగిందంటే... 72 గం. పాటు పొలిటీషియన్ల ఎంట్రీపై నిషేధం
పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బెహార్ జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఎన్నికల సంఘం స్పందించింది. హింసకు దారితీసిన పరిస్థితులను వివరించింది. అనారోగ్యం పాలైన ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది చూపిన చొరవను స్థానికులు తప్పుగా అర్థం చేసుకోవడమే హింసకు దారితీసిందని వెల్లడించింది.
ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం... సీతల్కుచి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 126 వద్ద మాణిక్ మహమ్మద్ అనే యువకుడు అనారోగ్యానికి గురై కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ఇద్దరు,ముగ్గురు మహిళలు ఆ యువకుడికి ఏమైందో చూస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పోలీస్ వాహనంలో అతన్ని ఆస్పత్రికి తరలిస్తారా అని ఆ మహిళలను అడిగారు.

ఇంతలో అక్కడికి వచ్చిన కొంతమంది గ్రామస్తులు... సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందే యువకుడిపై దాడి చేశారని భావించారు. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. కాసేపట్లోనే దాదాపు 300-350 మంది గ్రామస్తులు అక్కడ గుమిగూడారు.సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది దాడి చేయడం వల్లే యువకుడు సొమ్మసిల్లి పడిపోయారని భావించారు. అంతే.. భద్రతా సిబ్బందిపై అంతా కలిసి దాడికి పాల్పడ్డారు. అంతేకాదు,పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఎన్నికల అధికారులపై కూడా దాడికి యత్నించారు.
ఈ నేపథ్యంలోనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్విక్ రెస్పాన్స్ టీమ్ను కూడా పిలిచారు. అయితే వారిపై కూడా గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఇక పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది... మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ ఆ గుంపు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు,ఈవీఎం,ఇతరత్రా పోలింగ్ సామాగ్రి ధ్వంసం కాకుండా చూసేందుకు వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది.
ఈ కాల్పుల్లో బుల్లెట్ గాయాలైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాల్పులతో గ్రామస్తులను చెదరగొట్టాక... గాయపడ్డ హోంగార్డు,సీఐఎస్ఎఫ్ సిబ్బంది,పోలింగ్ బూత్లోని అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తమపై జరిగిన దాడిపై సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో... ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది.
కూచ్ బెహార్లో మళ్లీ అవాంఛనీయ సంఘటనలేవీ తలెత్తకుండా 72గంటల పాటు అక్కడ పొలిటీషియన్ల రాకపోకలపై నిషేధం విధించారు. అలాగే ఐదో విడత ఎన్నికల ప్రచారానికి 'సైలెన్స్ పీరియడ్'ను 48 గంటల నుంచి 72గంటలకు పొడగించారు. సాధారణంగా పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారానికి తెరపడుతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఐదో విడత పోలింగ్కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.
Recommended Video
కాగా,ఈ కాల్పుల ఘటనకు టీఎంసీ,బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.సీఎం మమతా బెనర్జీనే భద్రతా సిబ్బంది పైకి ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... 'భద్రతా బలగాలపై కేంద్రహోంశాఖ ప్రభావం ఉందని మేము ముందునుంచి చెప్తున్నాం... మా భయాలే ఇప్పుడు నిజమయ్యాయి.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి..' అని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు.












Click it and Unblock the Notifications