అయ్యప్పను దర్శించిన మహిళలు వీరే..తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయ్యప్పస్వామి సన్నిధానంలోనికి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ దాఖలైన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరి కొన్ని గంటల్లో తన తుది తీర్పును వెలువరించబోతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలో ఏర్పాటైన అయిదు మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇవ్వబోతోంది. ఇదివరకు తానే ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించబోతోంది సుప్రీంకోర్టు.

ఎందుకీ వివాదం..
హైందవ ఆచార, వ్యవహారాల ప్రకారం.. శబరిగిరుల్లో వెలిసిన మణికంఠుడిని మహిళలు దర్శించుకోవడం నిషేధం. పదేళ్ల బాలికల నుంచి 50 సంవత్సరాల మహిళలు స్వామివారిని దర్శించకూడదని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని సవాలు చేస్తూ భూమాత బ్రిగేడ్ సామాజిక ఉద్యమకారణి తృప్తి దేశాయ్ గత ఏడాది దాఖలు చేసిన పిటీషన్ పై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర సారథ్యంలో జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసుపై సానుకూలంగా తీర్పు ఇచ్చింది. పదేళ్లు నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చని ఆదేశించింది.

జనవరి 2న తొలిసారిగా..
గత ఏడాది అక్టోబర్ లో తీర్పు వెలువడగా.. ఈ ఏడాది జనవరి 2వ తేదీన తొలిసారి మహిళలు అయ్యప్పస్వామి సన్నిధానంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సి ఉన్నందున పోలీసుల భద్రతలో వారు సన్నిధానానికి వెళ్లారు. అయ్యప్ప స్వామి గుడిని మూసివేసేంత వరకు 12 మంది మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కేరళలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. అయ్యప్ప భక్తులు స్వచ్ఛందంగా ఆలయానికి భద్రతగా నిల్చున్నారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకుండా నిరోధించారు.

మారు వేషాలతో..
కేరళకే చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమల ఆలయంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ తరువాత మన రాష్ట్రానికి చెందిన మహిళా జర్నలిస్టు మాధవి సహా 10 మంది అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎస్ లిబి, సుహాసిని రాజ్(న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్), కవిత జక్కల (హైదరాబాద్,) రెహానా ఫాతిమా (పత్తినంథిట్ట), మేరీ స్వీటీ, ఎస్పీ మంజు, బిందు కల్యాణి, తృప్తి దేశాయ్ (ముంబై) అమ్మిని (వయనాడ్) అనే మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించగలిగారు. వారిలో కొందరు మహిళలు మారువేషాలతో శబరిగిరుల్లో అడుగు పెట్టారు. వృద్ధులుగా కనిపించడానికి జుట్టుకు తెల్లరంగు వేసుకుని మరీ వందలాది మంది భక్తుల కన్ను గప్పారు.

ఆలయం తెరచి ఉంచినన్ని రోజులూ.. ఉద్రిక్తతే
అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరచి ఉంచినన్ని రోజులూ ఉద్రిక్త పరిస్థితులే కొనసాగిన విషయం తెలిసిందే. శబరిమల ఆలయానికి వెళ్లడానికి తొలి మెట్టుగా భావించే నీలక్కళ్ మొదలుకుని పంబా, సన్నిధానం వరకూ వందలాది మంది అయ్యప్పస్వామి భక్తులు రోడ్లకు ఇరువైపులా నిల్చుని కాపు కాశారు. 50 ఏళ్ల లోపు మహిళలెవరూ సన్నిధానం వరకు చేరకుండా చూడగలిగారు. అదే సమయంలో మలయాళీ మహిళలు వేలాది మంది రోడ్ల మీదికి వచ్చి సేవ్ శబరిమల పేరుతో ఉద్యమాలను నిర్వహించారు. తీర్పును పున:సమీక్షించాలంటూ రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ స్వీకరించిన సుప్రీంకోర్టు.. తన తుది తీర్పును వెల్లడించనుంది.












Click it and Unblock the Notifications