#LotteryTicket: భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆమోదం, కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఎందుకు
ఇటీవల అనూప్ అనే ఆటోడ్రైవర్ కేరళ ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో రూ. 25 కోట్లు గెలుచుకున్నారు. ఓనం పండగ సందర్భంగా నిర్వహించే ఈ బంపర్ లాటరీలో ఈ ఏడాది అత్యధికంగా రూ. 25 కోట్లను ప్రైజ్ మనీగా ప్రకటించారు. భాగ్యవతి లాటరీ ఏజెన్సీ నుంచి టికెట్ కొనుక్కున్న అనూప్.. టికెట్ కొన్న మరుసటి రోజే విజేతగా నిలిచారు.
అనూప్ జీవితాన్ని మలుపు తిప్పిన ఈ లాటరీ వార్త చాలామందిని ఆకర్షించింది. లాటరీల గురించి చర్చకు దారి తీసింది..
భారతదేశంలో లాటరీల నిర్వహణ, టికెట్ల కొనుగోలు చట్టబద్ధమే అయినప్పటికీ, లాటరీ టికెట్లను కొనుక్కునే వీలు అన్ని రాష్ట్రాల్లో లేదు.
భారత్లో లాటరీలను నియంత్రించే చట్టాలేంటి? ఏయే రాష్ట్రాల్లో ఇవి చట్టబద్ధం? ఏ రాష్ట్రాల్లో కాదనే విషయాలను బీబీసీ పరిశీలించింది.
లాటరీ అంటే ఏంటి?
టికెట్లను కొనుక్కుని, 'డ్రా' ద్వారా బహుమతిని గెలుచుకోవడాన్ని లాటరీ అని నిర్వచిస్తోంది 'లాటరీ నియంత్రణ చట్టం 1998’,.
కేసినో, గుర్రపు పందేలు, జూదం లాంటి కార్యకలాపాలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించినప్పటికీ లాటరీలను కొన్నిచోట్ల ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తున్నాయి.
లాటరీ చరిత్ర ఏంటి?
ఆధునిక చరిత్రను పరిశీలిస్తే, బ్రిటిష్ పాలకులు 1867లో పబ్లిక్ గేమింగ్ చట్టాన్ని నిషేధించి లాటరీలను మాత్రం అనుమతించారని భారతదేశంలో లాటరీ మార్కెట్ గురించి ప్రచురించిన ఒక పరిశోధన పత్రంలో రాశారు. ఈ పత్రం ఈఎన్వి మీడియా అనే వెబ్ సైటులో ప్రచురితమైంది.
స్వతంత్ర భారతదేశంలో కేరళ రాష్ట్రం ప్రైవేటు వ్యక్తులు లాటరీ నిర్వహించడాన్ని నిషేధించి తొలిసారిగా ప్రభుత్వ లాటరీ నిర్వహణను ప్రవేశపెట్టింది. తర్వాత మరి కొన్ని రాష్ట్రాలు కేరళను అనుసరించాయి.
భారతదేశంలో లాటరీ నిర్వహణ చట్టబద్ధమే. లాటరీల నియంత్రణ చట్టం -1998 అమలులో ఉంది.
70, 80లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో లాటరీ టికెట్ల విక్రయం కనిపిస్తూ ఉండేది. చిన్న చిన్న పాన్ షాపులు, ప్లాట్ ఫార్మ్ ల పై కూడా లాటరీ టికెట్లు అమ్ముతూ ఉండేవారు.
లాటరీ గెలిస్తే జీవితంలో కష్టపడకుండా స్థిరపడినట్లే అని భావించి లాటరీ టికెట్లు కొనుక్కునేవారు కూడా ఉండేవారు.
భారతదేశంలో లాటరీ రాష్ట్రాల పరిధిలో ఉంటుంది.
లాటరీ రెగ్యులేషన్ చట్టం 1998 ప్రకారం - కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు లాటరీ నిర్వహణ కోసం తమ సొంత నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని ఇచ్చింది.
అయితే, లాటరీలు అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేవు. కొన్ని రాష్ట్రాల్లో లాటరీ టికెట్లను కొనుక్కోవడం చట్టబద్ధం కానీ, కొన్ని రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకం. లాటరీలు అమలులో ఉన్న రాష్ట్రాలు, ఇతర చట్టపరమైన వివరాలను శ్రీకాకుళానికి చెందిన న్యాయవాది అనిల్ కుమార్ గోరా బీబీసీకి వివరించారు.
- కోడిపందేల చరిత్ర తెలిసి ఉండొచ్చు.. మరి కోడి చరిత్ర తెలుసా?
- సంక్రాంతి సంబరాలకు భీమవరం ఎందుకు కేంద్రంగా మారింది
ఏయే రాష్ట్రాల్లో లాటరీ చట్టబద్ధం?
భారతదేశంలో 13 రాష్ట్రాల్లో లాటరీల నిర్వహణ చట్టబద్ధం. ప్రైవేటు వ్యక్తులు లాటరీని నిర్వహించడం నిషేధం. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే వీటిని నిర్వహిస్తాయి.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో లాటరీల నిర్వహణ చట్టబద్ధం.
కేరళలో వారానికి సగటున 4 కోట్ల లాటరీ టికెట్లు అమ్ముడవుతాయని అంచనా.
ప్రభుత్వాలే నిర్వహించే ఈ రాష్ట్రాల లాటరీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు కూడా ఉంటాయి. వీటిని, భారత ప్రభుత్వ ఆర్ధిక శాఖ పర్యవేక్షిస్తుంది.
టాప్ బహుమతులను ప్రత్యేక లాటరీ విభాగం ఇవ్వగా, చిన్నచిన్న బహుమతులను టికెట్ అమ్మకందారులు ఇస్తారు.
లాటరీ టికెట్తో పాటు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రానికి చెందినవారిని మాత్రమే లాటరీ టికెట్లను కొనుక్కునేందుకు అనుమతిస్తాయి. ఇతర రాష్ట్రాల వారిని అనుమతించవు.
ముందుగానే నిర్వహించిన తేదీల్లో ప్రత్యేక డ్రా లను నిర్వహిస్తారు.
కేరళలో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను అమ్మడం నిషేధం. పంజాబ్లో ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ ఇతర రాష్ట్రాలు నిర్వహించే లాటరీ టికెట్లు అమ్మవచ్చు.
- ఏపీ, తెలంగాణల్లో డబ్బును బ్యాంకుల్లో వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది... ఆ సొమ్మును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- గుడివాడ కాసినో... వీడియోల్లో ఏముంది
ఏయే రాష్ట్రాల్లో చట్టబద్ధం కాదు?
భారతదేశంలో15 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాటరీ నిర్వహణ నిషేధం.
అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, బిహార్, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయూ, ఛత్తీస్గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్, ఒడిశా, పుదుచ్చేరి , రాజస్థాన్, తమిళ నాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో లాటరీల నిర్వహణ నిషేధం.
కర్ణాటక, తమిళనాడులోనూ లాటరీ టికెట్ల అమ్మకం జరిగేది కానీ, వీటిని నిషేధించారు.
ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ లాటరీలు లేవు. ఒకప్పుడు దిల్లీ ప్రభుత్వం లాటరీలు నిర్వహించేంది, కానీ ప్రస్తుతం అవి నిషేధం
తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లు అమ్మడానికి అనుమతి లేదు.
హరియాణా, దిల్లీలో ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లు అమ్మే అవకాశముంది.
https://www.youtube.com/watch?v=cpMh0pefI9o
ఆన్లైన్లో పక్క రాష్ట్రం లాటరీలో పాల్గొనవచ్చా?
భారత పౌరులు ఆన్లైన్ లాటరీలు నిర్వహించడం నిషేధం. భారతదేశంలో పేపర్ లాటరీలు మాత్రమే జరుగుతాయి.
డ్రా లో పాల్గొనేందుకు లాటరీ టికెట్ కొనుక్కోవాల్సిందే. ఆన్లైన్లో పక్క రాష్ట్రాల్లో టికెట్ కొనడం నిషేధం.
నవంబరు 2001లో సిక్కిం ఆన్ లైన్ లాటరీని 'ప్లే విన్' అనే పేరుతో మొదలుపెట్టింది. కానీ, ఈ లాటరీలు నిర్వహించే సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో వీటిని నిలిపేశారు. తర్వాత చట్టబద్ధమైన ఆన్ లైన్ లాటరీని ఎవరూ మొదలుపెట్టలేదు.
కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ లాటరీ వెబ్ సైట్లు ఉన్నాయి.
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- అనంతపురంలో మట్కా: జూదం 'ఓపెన్’, జీవితం 'క్లోజ్’
మినిమం టికెట్ రూ. 2.. మినిమం ప్రైజ్ మనీ రూ. 10,000.. ఇవీ లాటరీ చట్టంలో నియమాలు
లాటరీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక గెజెట్ ద్వారా నియమాలను రూపొందించవచ్చు
అయితే, ముందుగానే ప్రకటించిన సంఖ్య లేదా సింగిల్ డిజిట్ ఆధారంగా లాటరీలో గెలుచుకున్న బహుమతి సొమ్ము ఇవ్వకూడదు
లాటరీ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంతో ముద్రించాలి.
రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లేదా ప్రభుత్వం నియమించిన అధికారిక ఏజెంట్ల ద్వారా మాత్రమే వీటిని అమ్మాలి.
లాటరీ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మాత్రమే వెళ్ళాలి.
రాష్ట్ర ప్రభుత్వమే లాటరీలు, డ్రా నిర్వహించాలి.
లాటరీలో బహుమతి డబ్బును ఎవరూ తీసుకొని పక్షంలో ఆ డబ్బు ప్రభుత్వానికే చెందుతుంది.
రాష్ట్ర ప్రభుత్వమే డ్రా తీసే ప్రదేశాన్ని కూడా నిర్దేశిస్తుంది.
ఒక ఏడాదిలో ఆరు కంటే ఎక్కువ బంపర్ డ్రాలు జరిగేందుకు వీలు లేదు.
లాటరీ టికెట్ ధర రూ. 2 కంటే తక్కువ ఉండకూడదు. బహుమతి సొమ్ము రూ. 10000 కంటే తక్కువ ఉండకూడదు.
లాటరీ ఫలితాలను కనీసం ఒక జాతీయ వార్తాపత్రిక, రెండు ప్రాంతీయ వార్తాపత్రికల్లో ప్రచురించాలి.
- చరిత్రాత్మక తీర్పుల వెనకున్న 5 ప్రజాప్రయోజన వ్యాజ్యాలివీ.. ఇలాంటి కేసులు పెండింగ్లో ఎందుకు?
- పాకిస్తాన్ గూఢచారుల వాట్సాప్ గ్రూప్లో భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు... ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
లాటరీ, బంపర్ డ్రా కు తేడా ఏంటి?
బంపర్ డ్రా లో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. కొన్ని ఉత్పత్తులను కొన్నవారికి మాత్రమే బంపర్ డ్రా లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీటిలో గెలుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఉత్పత్తులను కొన్న వినియోగదారులకు మాత్రమే పరిమితంగా ఉంటుందని అనిల్ కుమార్ అన్నారు.
లాటరీ టికెట్లను ఎవరైనా కొనుక్కోవచ్చు. గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
లాటరీలో గెలుచుకునే బహుమతి సొమ్ముపై పన్ను ఉంటుందా?
లాటరీలో గెలుచుకున్న బహుమతి సొమ్ము పై పన్ను చెల్లించాలని భారతీయ ఆదాయ పన్ను చట్టం చెబుతోంది.
లాటరీలో గెలిచిన బహుమతి సొమ్ము పై 30శాతం పన్ను చెల్లించాలి.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
- ఆంధ్రప్రదేశ్: హెల్త్ యూనివర్సిటీకి మూడోసారి పేరు మార్పు.. అభ్యంతరాలు ఎందుకు? ఇబ్బందులు ఏంటి?
- ముకేశ్ అంబానీ: ఆస్తుల పంపకాల్లో కొడుకులతో సమానంగా కూతురికీ ప్రాధ్యాన్యమిస్తున్నారా?
- యుక్రెయిన్ యుద్ధం: రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందా
- ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్కు ఆఖరి మ్యాచ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)