ప్రియురాలిని.. ఇష్టమొచ్చినట్లు వేధించమని స్నేహితుడితో!: బ్రేకప్ చెప్పినందుకు ఇలా?
బన్సావాడి నుంచి ఆఫీసు పని ముగించుకుని బయటకు వచ్చిన ఆ యువతిపై.. ప్రమోద్ స్నేహితులు దాడి చేశారు.
బెంగళూరు: ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత తన నుంచి విడిపోయిన ప్రియురాలి పట్ల ఓ ప్రియుడు పీకల్లోతు పగ పెంచుకున్నాడు. ఒకప్పటి ప్రేమ స్థానంలో ప్రతీకారేచ్చతో రగిలిపోయాడు. ఆమెను అసభ్యంగా వేధించడానికి, అవసరమైతే లేపేయమని చెప్పి మరీ తన స్నేహితుడిని ఉసిగొల్పాడు. దీంతో పట్టపగలు, నడిరోడ్డు మీద ఆ యువతిపై హత్యాయత్నం జరిగింది.
బొమ్మనహళ్లి ప్రాంతంలోని బన్సావాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో మాజీ ప్రియుడే హత్యకు ప్లాన్ చేశాడని తేలింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బొమ్మనహళ్లికి చెందిన ప్రమోద్(32) బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం అతనికి ఓ అమ్మాయి పరిచయం అవడం.. ఇన్నేళ్లుగా వారు ప్రేమలో మునిగి తేలడం జరిగాయి.
అయితే ఇటీవల చోటు చేసుకున్న విభేదాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రేయసి బ్రేకప్ చెప్పేసిందన్న కోపంతో ప్రమోద్ పగతో రగిలిపోయాడు. ఆమెను అసభ్యంగా వేధించడానికి ఓ స్నేహితుడిని పురమాయించాడు. దీంతో ఫోన్ ద్వారా నిత్యం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అవసరమైతే ఏమైనా చెసేయ్.. అంటూ హత్యకు ఉసిగొల్పాడు. ఇందుకోసం రూ.1.10లక్షలు కూడా ముట్టజెప్పాడు.
ఈ నేపథ్యంలో బన్సావాడి నుంచి ఆఫీసు పని ముగించుకుని బయటకు వచ్చిన ఆ యువతిపై.. ప్రమోద్ స్నేహితులు దాడి చేశారు. స్కూటీ స్టార్ట్ చేయబోతుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆమెను గట్టిగా పట్టుకోగా.. కుమార్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. మూడుసార్లు ఆమెను కత్తితో పొడిచాడు. ఆపై యువతి కేకలతో నిందితులు పరారయ్యారు. యువతి చెప్పిన ఆధారాల ప్రకారం.. ప్రియుడు ప్రమోద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజాలు వెలుగుచూశాయి. నిందితులపై ఐపీసీ సెక్షన్ 307ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కాగా, తనతో ప్రేమకు బ్రేకప్ చెప్పినందుకే ప్రియురాలిపై దాడి చేయించానని ప్రమోద్ ఒప్పుకున్నాడు. ఇందుకోసం సుఫారీ ఇచ్చినట్లు కూడా తెలిపాడు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.