హాట్ టాపిక్ : ర్యాంప్ వాక్ చేయబోతున్న సీఎం భార్య..
న్యూయార్క్ : మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవిస్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో తళుక్కుమనబోతున్నారు. పేదింటి పిల్లల ప్రతిభను, ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించే నిమిత్తం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. యువ డిజైనర్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో.. పుణేకు చెందిన ఛేసా డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ తరుపున షో స్టాపర్ గా వ్యవహరిస్తున్నారు అమృత ఫడ్నవిస్.
ఈ నేపథ్యంలోనే.. ఛేసా డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో న్యూయార్క్ లో నిర్వహించబోతున్న ఫ్యాషన్ వీక్ లో అమృత ఫడ్నవిస్ పాల్గొనబోతున్నారు. ఫ్యాషన్ వీక్ లో భాగంగా.. ర్యాంప్ మీద కనువిందు చేయనున్నారు అమృత ఫడ్నవిస్. ఇదిలా ఉంటే.. ఈ ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించబోతున్న వస్త్రాల్లో ఎక్కువ శాతం రైతులు, కూలీల పిల్లలు రూపొందించినవే కావడంతో.. వారి ప్రతిభను ప్రపంచ వేదికపై గొప్పగా చాటాలనే ఉద్దేశంతో ర్యాంప్ వాక్ లోను ఆమె పాలు పంచుకోనున్నారు.
ఇదే విషయంపై వివరణ ఇచ్చిన అమృత ఫడ్నవిస్.. ''బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో, ఓ మంచి సందేశంతో నేనీ ర్యాంప్ వాక్ లో పాల్గొనబోతున్నాను. ఈ షో లో ప్రదర్శించబోయే చేనేత వస్త్రాలన్నీ రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించినవే. వారి ప్రతిభను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వినూత్న కార్యక్రమం. ఒక బాలికను చదించడమంటే కుటుంబం మొత్తాన్ని చదివించడమే. కుటుంబాలన్ని విద్యావంతం అయితే దేశం పురోగతి మరింత విస్తృతమవుతుంది' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు అమృత ఫడ్నవిస్.