President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. ఈ మేరకు తన సిఫారసును కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అసెంబ్లీ పలితాలు వెలువడిన 20 రోజుల తరువాత కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని.. గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మంగళవారం రాత్రి 8:30 గంటల తరువాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందని రాజ్ భవన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి.

తొలి గడువు దాటినా..
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కోష్యారి.. శివసేనకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారు. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు గడువును ఇచ్చారు. అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన 145 స్థానాలు సంఖ్యాబలం శివసేనకు లేదు. ఈ నేపథ్యంలో- కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ)లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన నిర్ణయించుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు.

మలి గడువు దాటితే.. రాష్ట్రపతి పాలనలోకి
ఫలితంగా గడువును పొడిగించాలని శివసేన గవర్నర్ ను కోరింది. మూడు రోజుల గడువు కావాలని శివసేన నాయకులు గవర్నర్ కు విజ్ఞప్తి చేయగా ఆయన ఇందుకు నిరాకరించారు. మంగళవారం రాత్రి 8:30 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈ లోగా శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన అంగీకారాన్ని గవర్నర్ కు తెలియజేయాల్సి ఉంటుంది. అంతే కాదు.. తమ పార్టీకి మద్దతు ఇస్తోన్న శాసన సభ్యుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని శివసేన నాయకులు గవర్నర్ కు అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శివసేన నాయకులు ఈ దిశగానే కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇక భారం కాంగ్రెస్ పైనే..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివసేనకు మద్దతు ఇవ్వడానికి ఎన్సీపీ సానుకూలంగా ఉంది. అయినప్పటికీ.. తన మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి సానుకూల సంకేతాల కోసం ఎదురు చూస్తోంది. శివసేనకు మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరిని వెల్లడించలేదు. దేశ రాజధాని వేదికగా సమావేశాల మీద సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ డెడ్ లైన్ విధించడం, ఆ మరుక్షణమే రాష్ట్రపతి పాలన అమలు అయ్యేలా సిఫారసులను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించేయడం శరవేగంగా చోటు చేసుకుంది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మరింత వేగంగా తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications