ఉద్ధవ్ థాకరే ఏం చేయబోతున్నారు: మహారాష్ట్ర మంత్రివర్గ అత్యవసర భేటీ..ఇదే చివరిదా?
గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. మంత్రి ఏక్నాథ్ షిండే.. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమితో కూడిన మహా వికాస్ అగాఢీ కూటమిలో చిచ్చు రాజేసిన అనంతరం పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ వెంట ఉండటం సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ పతనం తప్పకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది.
కేబినెట్ భేటీ..
ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర మంత్రివర్గం ఇవ్వాళ అత్యవసరంగా భేటీ కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సమావేశం షెడ్యూల్ అయింది. శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దీనికి అధ్యక్షత వహించనున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందంటూ ఇప్పటికే సమాచారం అందింది. ఇదే చివరి భేటీ అవుతుందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మంత్రివర్గంపై దృష్టి..
ప్రస్తుతం అందరి దృష్టీ మంత్రివర్గ సమావేశంపైనే నిలిచింది. ఉద్ధవ్ థాకరే ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠతను రేపుతోంది. ఇవ్వాళ్టి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ మీద మంత్రులతో చర్చిస్తారని, పతనం అంచుల్లో నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాల్సి ఉంటుందనే విషయం చర్చకు వస్తుందని చెబుతున్నారు. గవర్నర్ను కలవాలా? లేదా? అనేది ఇందులోనే నిర్ణయిస్తారని సమాచారం.

గవర్నర్ను కలవడంపై..
సంక్షోభం ఏర్పడిన అనంతరం అసెంబ్లీలో సంకీర్ణ కూటమికి ఉన్న బలాన్ని అంచనా వేసుకున్న తరువాత ఉద్ధవ్ థాకరే గవర్నర్ను కలుస్తారని అంటున్నారు. తమ ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశమే లేదంటూ అటు శివసనే సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఏక్నాథ్ చెబుతున్నట్లుగా ఆయన వెంట అంతమంది ఎమ్మెల్యేలు లేరని చెబుతున్నారాయన.

అంతర్గత వ్యవహారమంటూ..
మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు.. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ వ్యవహారం మీద కూటమి నేతలు ఇదివరకే స్పందించారు. ఇదంతా శివసేన అంతర్గత వ్యవహారమంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇదివరకే వ్యాఖ్యానించారు. ఇవ్వాళ ఆయన తమ పార్టీకి చెందిన శాసన సభ్యులతో సమావేశం కానున్నారు. ఏడుమంది స్వతంత్ర అభ్యర్థులు ఏక్నాథ్కు మద్దతు ఇవ్వడం వెనుక బీజేపీ అధిష్ఠానం ప్రమేయం ఉందని, వారిని ప్రలోభానికి గురి చేసిందని విమర్శించారు.

అస్సాంలో ఏక్నాథ్..
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు ఉన్న సంఖ్యాబలం 55. ఇందులో 33 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనవెంటే ఉన్నారంటూ ఏక్నాథ్ షిండే ప్రకటించుకున్నారు. మరో ఏడుమంది స్వతంత్ర శాసన సభ్యులు కూడా తన మద్దతు ఇస్తున్నారంటూ షిండే చెబుతున్నారు. ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గుజరాత్ నుంచి అస్సాంకు చేరుకున్నారు. వారంతా ఇవ్వాళ బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకుంటారనే ప్రచారం సాగుతోంది. తనకు మద్దతు ఇస్తోన్న 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారనీ సమాచారం.












Click it and Unblock the Notifications