జోరుగా క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలతో రిసార్టుల కళకళ.. చార్టెడ్ ఫ్లయిట్లో రెబెల్స్
ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శనివారం ఉదయమే ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్త రాజకీయ నాయకుల్లో బాంబు పేల్చినంత పనిచేసింది. దాంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశంలోని పాలిటిక్స్ కాస్త వేడెక్కాయి. దాంతో ఒక్కసారిగా క్యాంపు, రిసార్టు రాజకీయాలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఐదేళ్ల తర్వాత వైరల్ అవుతున్న ఫడ్నవీస్ ట్వీట్.. అప్పుడేమన్నారంటే..?
స్పీకర్ ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడైన ప్రముఖ నేత అజిత్ పవార్ పార్టీ నియమాలను ఉల్లంఘించిన బీజేపీతో చేతులు కలపడం సంచలనం రేపింది. దేవేంద్ర ఫడ్నవీస్తోపాటు ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత బల నిరూపణకు స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంతో మహారాష్ట్ర రాజకీయ నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
జోరుగా క్యాంపు రాజకీయాలు
మహారాష్ట్రలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు కూడగట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీ నాయకత్వాలు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్రలో క్యాంపు రాజకీయాలు ఊపందుకొన్నాయి. ఆయా పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు, హోటల్స్కు తరలిస్తున్నారు. తమ సొంత నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను రాష్ట్ర రాజధానికి రప్పిస్తున్నారు.
కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యేలను..
కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలో కొంత మందిని మధ్యప్రదేశ్లోని భోపాల్కు, మరికొందరిని రాజస్థాన్లోని జైపూర్కు తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక శివసేన తన ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్లో పెట్టడం జరిగింది. ఉద్దవ్ థాకరే ఆదేశాల వస్తే వారిని మరో చోటుకు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్సీపీ నేత ఓ సురక్షిత ప్రాంతానికి ఎమ్మెల్యేలను తరలిస్తున్నట్టు మీడియాతో పంచుకొన్నారు.
చార్టెడ్ ఫ్లయిట్లో రెబెల్స్ ఢిల్లీకి
కాగా, ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్లో ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత గూటికి తరలివచ్చి శరద్ పవార్ను కలిశారు. ఎన్సీపీ ఎమ్మెల్యే అతుల్ బెంకే, ధనుంజయ్ ముండే శరద్ పవార్ను కలిసిన వారిలో ఉన్నారు.