కోట్ల ఆస్తులు కూడగట్టిన అధికారి: విచారణకు డిమాండ్
పుణె: ప్రభుత్వానికి సంబంధించిన 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకున్నాడని మహారాష్ట్రలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు వస్తున్నాయి. పుణెలో డివిజనల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ దేశ్ముఖ్... అతని నియంత్రణలో ఉన్న ఐదు జిల్లాల్లోని 150 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని పలు ప్రజాస్వామిక సంఘాలు ఆరోపించాయి.
ఇందుకు సంబంధించిన పలు పత్రాలు కూడా బయటికివచ్చాయి. ప్రభాకర్ దేశ్ముఖ్ మరో బిల్డర్ రమేష్ కవేడియాతో కలిసి సంయుక్తంగా సుమారు 300 ఎకరాలను సతారా జిల్లాలోని ఓ గ్రామంలో రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. చదరపు అడుగు భూమిని రూ. 2 కంటే తక్కువకే కొనుగోలు చేశారని వెల్లడైంది. కాగా ఆ భూమి పునరావాసం కల్పించేందుకు రిజర్వు చేయబడిందని అధిరారిక రికార్డుల్లో ఉండటం గమనార్హం.

అయితే గత సంవత్సరం ఆ భూమి విలువ అమాంతం రూ. 127 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు రావడంతో జనవరి 28న ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని రమేష్ కవేడియా ఆ శాఖలకు విన్నవించుకున్నారు. సిద్ధివినాయక రియల్ ఎస్టేట్ సంస్థను నిర్వహిస్తున్న కవేడియా ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొంటున్నారు. ఈ భూమి కొనుగోలు అనేది చాలా పారదర్శకంగా జరిగిందని, కొందరు గిట్టని వాళ్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఐఏఎస్ అధికారి ప్రభాకర్ దేశ్ముఖ్ తెలిపారు.
2011లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభాకర్ దేశ్ముఖ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 95 ఎకరాల భూమితోపాటు పుణె, ముంబైల్లో ఆరు కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
తన నెలసరి జీతం రూ. 82వేలని ప్రభాకర్ వివరించారు. తను నిర్వహిస్తున్న శాఖ నిర్వహించిన వేలంలో తన స్వగ్రామంలోని 6వేల చదరపు అడుగుల భూమిని రూ. 50వేల కొనుగోలు చేసినట్లు ప్రభాకర్ తెలిపారు.
కాగా ఐఏఎస్ అధికారి ప్రభాకర్ దేశ్ముఖ్ ఆక్రమంగా ఆక్రమించుకున్న భూములపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్కు సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త విజయ్ కుంభర్ ముఖ్యమంత్రి ఓ లేఖను రాశారు. అతని నుంచి లాభాలను పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా ప్రభాకర్ సన్నిహితంగా ఉంటున్నారని కుంభర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications