ఆదరణ కరువు: వృద్ధాశ్రమంలో గాంధీ మనవడు
న్యూఢిల్లీ: అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మాగాంధీకి అతడు స్వయంగా మనుమడు. తన చిన్నతనంలో గాంధీ తాతయ్య ఒడిలోనే పెరిగాడు. కానీ, ఇప్పుడు ఆదరణ కరువై తన 87వ యేట ఢిల్లీలోని వృద్ధాశ్రమంలో రోజులు వెళ్లదీస్తున్నారు. ఆయనే కన్నూభాయ్ గాంధీ.
గాంధీజీ మూడవ కుమారుడైన రాందాస్ గాంధీ కుమారుడే ఈ కన్నూభాయ్ గాంధీ. నిరాశ్రయులకు నీడనిచ్చే వృద్ధాశ్రమంలో తన 85 సంవత్సరాల సతీమణి డాక్టర్ శివలక్ష్మితో ఉంటున్నారు. పిల్లలు లేని ఈ దంపతులు తమ జీవితంలో అధికభాగం అమెరికాలోనే గడిపారు.
కన్నూభాయ్ నాసాలో పని చేయగా, బోస్టన్లో ఆయన సతీమణి ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. తమవారితో కలిసి చివరిరోజులు గడుపుదామని 2014లో ఇండియా వచ్చారు.
బంధువులు పెద్దగా ఆదరించకపోవడంతో విరక్తి చెందారు. ఒక ఆశ్రమం నుంచి మరో అశ్రమానికి మారుతూ చివరికి మే 8న ఢిల్లీలోని గురువిశ్రాం వృద్ధాశ్రమం చేరుకున్నారు. అరకొర సౌకర్యాల మధ్య గడుపుతున్నారు. తీవ్రంగా జబ్బుపడ్డవారికిచ్చే చిన్న ఏసీ గదిలో సర్దుకుంటున్నారు.
ఈ ఆశ్రమంలో 130 మంది వృద్ధులు, 40 మంది సహాయకులకు నాలుగే టాయిలెట్లు ఉన్నాయి. అదీ అక్కడి దుర్భర పరిస్థితి. సబర్మతి ఆశ్రమం నుంచి వెళ్లివచ్చిన కన్నూభాయ్ దంపతులు.. ఢిల్లీలోని గురు విశ్రమ్ వృద్ధాశ్రమంలో ఉంటున్నట్లు వృద్ధాశ్రమం యజమాని డాక్టర్ జీపీ భగత్ చెప్పారు. సబర్మతి ఆశ్రమం నుంచి వీరిని వెళ్లగొట్టారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
కాగా, 'కష్టకాలంలో మా బంధువులెవరూ మమ్మల్ని ఆదుకోవడం లేదు. బాపూజీ సంతానం ఆయనకు పూర్తి విరుద్ధమైన రీతిలో వ్యవహరిస్తున్నారు' అని కానూభాయ్ గాంధీ ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. 'అమెరికాకు తిరిగిపోవాలన్నా అందుకు సమయం మించిపోయింది' అని డాక్టర్ శివలక్ష్మి వాపోతున్నారు.