మహాత్ముడి కొడుకు రేప్?: గాంధీజీ సంచలన లేఖలు
లండన్: లండన్ యాక్షన్ హౌస్ ఇప్పటి వరకు జాతిపిత మహాత్మా గాంధీకి చెందిన పలు వస్తువులను వేలం వేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు లేఖలను వేలం వేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ లేఖలు సంచలనం రేపే విధంగా ఉండటం గమనార్హం. తన తనయుడి వైఖరిని తప్పు పడుతూ మహాత్ముడు ఘాటుగా రాసిన లేఖలను వేలం వేయనుంది. ఈ లేఖలలోని సారాంశం ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మహాత్ముడి పెద్ద కొడుకు హరిలాల్ కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడా? అదీ ఆమెకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడా?.. వేరెవరో కాదు సాక్షాత్తూ గాంధీజీ రాసిన లేఖల ద్వారా వెల్లడైన ఈ అంశాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివరాలున్న మూడు లేఖలు మే 22న లండన్లో వేలానికి రానున్నాయి.
1935 జూన్ 6 తేదీతో గుజరాతీ భాషలో గాంధీజీ చేతిరాతతో ఈ లేఖలు ఉన్నాయి. వీటిలో గాంధీ తన కుమారుడిని ఉద్దేశించి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారట. నీ గురించి మను ఎన్నో ఘోరమైన విషయాలను చెప్పిందని, మనుకు ఎనిమిదేళ్లు కూడా రాక ముందు తనపై నువ్వు అత్యాచారం చేశావని, తాను చికిత్స తీసుకోవాల్సినంతగా గాయపడినట్లు తెలిపిందని గాంధీజీ ఓ లేఖలో పేర్కొన్నారట.
తనను పూర్తి నిజం తెలుసుకోనివ్వాలని, ఇప్పటికీ ఇప్పటికీ నువ్వు మద్యం మత్తులో జోగుతూ వేశ్యాలోలుడివిగానే ఉన్నావా? మద్యానికి బానిస కావడం కంటే నువ్వు చనిపోవడమే మంచిదని తాను అనుకుంటున్నానని, మనశ్శాంతి కరువైన నిన్ను ఆ భగవంతుడే కాపాడాలని, దీవెనలతో.. బాపు, వార్ధా, 1935 అని అందులో రాసి ఉందట.

ఇంకో లేఖలో మన జాతీయ స్వాతంత్య్రం సమస్య కంటే నీ సమస్యే నన్ను ఎక్కువగా బాధిస్తోందని నువ్వు తెలుసుకోవాలని రాశారట. మరో లేఖలో హరిలాల్కు అతని భార్య సోదరితో ఉన్న వివాహేతర సంబంధం గురించి గాంధీజీ ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఆనంద్ లాల్ చెబుతున్న ప్రకారం ఆమె సిఫిలిస్తో బాధపడుతోందని, దాన్నుంచి నువ్వెలా తప్పించుకోగలవని అందులో ప్రశ్నించారట.
ఈ లేఖలపై ప్రముఖ గాంధేయవాది, ప్రస్తుతం సబర్మతీ ఆశ్రమ్ ప్రిజర్వేషన్ మెమోరియల్ ట్రస్తు ప్రొఫెసర్ త్రిదీప్ సుహృద్.. ఆ చేతిరాత గాంధీజీదేనని ద్రువీకరించారు. అయితే మహాత్ముడు ఈ లేఖల్లో బలాత్కార్ అనే పదాన్ని వాడారని, గుజరాతీలో బలాత్కార్ అనే పదాన్ని బలవంతం చేయడమనే అర్థం కూడా వస్తుందని అభిప్రాయపడ్డారు.
అంతమాత్రాన తాను హరిలాల్ గాంధీని వెనకేసుకొస్తున్నట్టు కాదని కానీ, గాంధీ ఆ పదాన్ని ఆ అర్థంలో కూడా వాడి ఉండొచ్చనే తాను అనుకుంటున్నానని చెప్పారు. కాగా ఈ లేఖలకు రూ.60 లక్షల దాకా పలికే అవకాశం ఉందని వీటిని వేలం వేస్తున్న ముల్లాక్స్ సంస్థ తెలిపింది. వీటితో పాటు నెహ్రూ సోదరికి గాంధీ రాసిన 27 లేఖలు కూడా వేలం వేయనున్నారు.












Click it and Unblock the Notifications