నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు- మమత సంచలన కామెంట్స్
పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన సీఎం మమతా బెనర్జీ వరుసగా రెండోరోజు మాటల దాడి కొనసాగించారు. నందిగ్రామ్లో కౌంటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె మరోసారి స్పందించారు. అంతేకాదు రిటర్నింగ్ అధికారిపైనా సంచలన ఆరోపణలు చేశారు.
Recommended Video
నందిగ్రామ్లో తుది ఫలితం వెలువడటానికి ముందే తనకు గవర్నర్ ఫోన్ చేసి అభినందించారని, కానీ రిటర్నింగ్ అధికారికి మాత్రం బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఆ తర్వాత ఫలితం మారిపోయిందని మమత తెలిపారు. రీకౌంటింగ్కు ఆదేశిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని రిటర్నింగ్ అధికారి ఓ వ్యక్తితో చెప్పినట్లు తనకు ఎస్సెమ్మెస్ వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆడియోను కూడా ఆమె బయటపెట్టారు. నాలుగు గంటల పాటు సర్వర్ డౌన్ అయిందని, గవర్నర్ అభినందనలు కూడా తెలిపాక ఫలితం మారిపోయిందని మమత వాపోయారు.
నందిగ్రామ్ ఫలితంపై రీకౌంటింగ్కు ఈసీ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించేందుకు మమతా బెనర్జీ సిద్దమవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో ఆమె బిజీగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఆమె గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరనున్నారు. నందిగ్రామ్లో మమత ఓటమి నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగడంపై ఉత్కంఠ నెలకొంది.