పీచమణిచిన దీదీ: థర్డ్ ఫ్రంట్ లీడర్ మమతానే?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు చీఫ్ మమతా బెనర్జీని దెబ్బ తీయడానికి శారద చిట్ ఫండ్స్ కుంభకోణం నుంచి నారద స్టింగ్ ఆపరేషన్ వరకు చాలానే ముందుకు వచ్చాయి. అయితే, అవేవీ మమతా బెనర్జీని దెబ్బ తీయలేకపోయాయి. రెండోసారి ఆమె పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చారు.
వామపక్ష కూటమి కాంగ్రెసుతో చేతులు కలిపినా మమతా బెనర్జీని ఏమీ చేయలేకపోయింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరులో ప్రతిపక్షాలను మమతా బెనర్జీ మరింత మూలకు నెట్టేశారు. ప్రతిపక్షాల కూటమిని అనైతికమైందిగా అభివర్ణించిన మమతా తనది మహా ప్రజా కూటమిగా చెప్పుకున్నారు. అది నిజమని నిరూపించారు.
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెసుతో కలిసి పనిచేసిన వామపక్ష కూటమి మరింతగా దిగజారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తిరుగులేని నేతగా ఈ ఎన్నికల ఫలితాలతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా, 2019 నాటికి జాతీయ స్థాయిలో తృతీయ కూటమి బలపడి దాని నేతగా మమతా బెనర్జీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

రెండో సారి పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడమే కాకుండా 42 మంది పార్లమెంటు సభ్యుల బలం ఉండడం వల్ల సహజంగానే తృతీయ కూటమి వామపక్షాలను పక్కన పెట్టి మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో దీదీ టచ్లో ఉన్నారు.
ముక్కోణపు పోటీలో 34 శాతం మంది ముస్లింలు కూడా మమతా వైపు నిలిచినట్లు అర్థమవుతోంది. పట్టణ ప్రాంత ప్రజలు తృణమూల్ కాంగ్రెసు పట్ల కాస్తా అసంతృప్తిగా ఉన్నా గ్రామీణ ఓటర్ల మద్దతు సంపూర్ణంగా మమతా బెనర్జీకి లభించినట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications