నా భార్యను వెతికి తీసుకురండి: లేదా దూకి చస్తా
ఫిరోజాబాద్: ఇల్లు వదిలి వెళ్లి పోయిన భార్యను వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ ఓ భర్త విద్యుత్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. ఐదు గంటల పాటు హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి అందరికి చుక్కలు చూపించాడు. చివరికి పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ సమీపంలోని అసఫాబాద్ లో రాంప్రసాద్ (40) అనే వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుటుంబ గొడవల కారణంగా 20 రోజుల క్రితం రాంప్రసాద్ భార్య భర్త, పిల్లలను వదిలి పెట్టి ఇల్లు వదిలి వెళ్లి పోయింది.
మూడు రోజుల పాటు భార్య కోసం గాలించిన రాం ప్రసాద్ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య ఆచూకి చిక్కకపోవడం, పిల్లలను చూసుకోవడం కష్టం కావడంతో రాంప్రసాద్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఇక లాభం లేదని పోలీసులకు భయం పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

అసఫాబాద్ పవర్ స్టేషన్ సమీపంలోని విద్యుత్ టవర్ ఎక్కాడు. తన భార్యను వెంటనే తీసుకురాకుంటే ఇక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని కేకలు వేస్తూ బెదిరించాడు. పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు.
ఐదు గంటల పాటు రాంప్రసాద్ అందరికి చుక్కలు చూపించాడు. చివరికి పోలీసులు అతనికి నచ్చ చెప్పడం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో నీ భార్యను వెతికి తీసుకువస్తామని ఫిరోజాబాద్ జిల్లా ఎస్పీ ఓంకార్ యాదవ్ స్పష్టమైన హామి ఇవ్వడంతో రాంప్రసాద్ కిందకు దిగి వచ్చాడు. వెంటనే అతనిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా రాంప్రసాద్ భార్య వెళ్లి పోయిందని ఓంకార్ యాదవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications