శృంగారం కోసం స్నేహితుడికి లింగమార్పిడి చేయించిన ఘనుడు
మానవ సంబంధాల మంట గలిసి పోతున్న ఘటనలు రోజుకోకటి వెలుగు చూస్తున్న తరుణంలో.. ఇంత కన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ సభ్యసమాజం సైతం నివ్వెరపోయే మరో విషయం జరుగుతూనే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక భయానక ఈ తరహా సంఘటన వెలుగుచూసింది. ఓ యువకుడిపై జరిగిన అకృత్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు కోరిక తీర్చుకునేందుకు ఇంతటి ఘాతుకానికి పూనుకోవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
స్నేహం పేరుతో ఓ యువకుడికి దగ్గరయ్యి.. క్రమంగా నమ్మకాన్ని పెంచుకొని.. యువకుడిని తన అనుమతికి విరుద్ధంగా లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించి.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ మృగాడు. అంతే కాకుండా బాధిత యువకుడి వద్ద నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితితో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఒబేదుల్లాగంజ్కు చెందిన ఓ యువకుడు పై చదువుల కోసం తన బంధువుల ఇంటికి భోపాల్ వెళ్లాడు. అక్కడే నర్మదాపురంకు చెందిన శుభం యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారడంతో వారిద్దరూ కలిసి అశోక్ గార్డెన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించసాగారు. అయితే శుభం.. సదరు యువకుడిపై తన దుర్బుద్ధిని క్రమక్రమంగా బయటపెట్టాడు. యువకుడికి తలనొప్పి రావడంతో చికిత్స పేరుతో తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లడం, అక్కడ అతని అనుమతి లేకుండా హార్మోన్ థెరపీ చేయించడం మొదలుపెట్టాడు.
తన శరీరంలో అనూహ్యమైన మార్పులు గమనించాడు బాధిత యువకుడు. ఆ సమయంలో శుభం, యువకుడిని ఇండోర్కు తీసుకెళ్లి, లింగ మార్పు శస్త్రచికిత్స బలవంతంగా చేయించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. శస్త్రచికిత్స అనంతరం యువకుడిని నర్మదాపురానికి తీసుకెళ్లిన శుభం.. తనపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు.. అందుకోసం తరచూ తనను వేధించేవాడని బాధిత యువకుడు ఆరోపించాడు. అంతే కాకుండా ఇప్పుడు తనకు రూ. 10 లక్షల ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడని, డబ్బు చెల్లించకపోతే తన జీవితాన్ని నాశనం చేస్తానని శుభం బెదిరించినట్టు కంప్లైంట్ చేశాడు.
ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ విజేంద్ర మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఈ షాకింగ్ వ్యవహారం ఇప్పుడు మానవ సంబంధాల వ్యవహరంలో కొత్త అనుమానాలకు తెర లేపుతోంది. ఇన్నాళ్లు మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలకు పాల్పడగా.. ఇప్పుడు ఈ విధంగా నేరాలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications